స‌జ్జ‌ల‌ను సైడ్ చేయాల్సిందే.. వైసీపీలో ఒక్క‌టే డిమాండ్‌!

పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని పార్టీ నుంచి సైడ్ చేయాల‌నే!

Update: 2024-10-11 05:30 GMT

వైసీపీ నేత‌ల నుంచి ఒకే ఒక్క డిమాండ్ తెర‌మీదికి వ‌స్తోంది. త‌క్ష‌ణం.. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని పార్టీ నుంచి సైడ్ చేయాల‌నే! ఇది ముమ్మాటికీ నిజం. ఎందుకంటే.. త‌న‌ను తాను ప్రొజెక్టు చేసుకునే క్ర‌మంలో స‌జ్జ‌ల వ్య‌వ‌హ‌రించిన రాజ‌కీయ‌మేన‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. అంతేకాదు.. స‌జ్జ‌లే శ‌త్రువ‌ని అనంత‌పురం జిల్లాకు చెందిన రెడీ నాయ‌కుడు(గ‌తంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయ‌కుడు) బ‌హిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు.

ఇక‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు చెందిన నాయ‌కులు స‌హా అంద‌రూ ఇదే మాట చెబుతున్నారు. స‌జ్జ‌ల ను సైడ్ చేయాల్సిందేన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఈ విష‌యంలో పార్టీ అధినేత జ‌గ‌న్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గాల వారీగా జ‌గ‌న్ భేటీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో పార్టీ త‌ర‌పున ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న నాయ‌కులు మ‌న‌సు విప్పుతున్నారు. తాము ఎమ్మెల్యేగా ఉన్నామా? అని అప్ప‌ట్లో అనిపించింద‌ని.. త‌మ‌కే అలా అనిపిస్తే.. కేడ‌ర్ ప‌రిస్థితి ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రికొంద‌రు మొహం మీదే చెప్పేస్తున్నారు. స‌జ్జ‌ల కార‌ణంగానే తాము ప్ర‌జ‌ల ముందు ప‌ల‌చ‌న అయ్యామని చెప్పేస్తున్నారు. ``ఏం చేయాల‌న్నా.. ఏం కావాల‌న్నా.. స‌జ్జ‌ల సార్ చెప్పారా? అని అధికారులు అడు గుతుంటే సిగ్గుతో అప్పుడే చ‌చ్చిపోయాం`` అని ఓ మ‌హిళా నాయ‌కురాలు, మాజీ ఎమ్మెల్యే గుంటూరు చెందిన నేత చెప్ప‌డం స‌జ్జ‌లపై పార్టీ ఎంత వ్య‌తిరేక‌త ఉందో స్ప‌ష్టం చేస్తోంది. ``మేం ప్ర‌జ‌ల నుంచి గెలిచాం. మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది. నువ్వు-నువ్వు అనిసంబోధించ‌డం ఏంటి స‌ర్‌`` అని తెనాలికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు ప్ర‌శ్నించారు.

ఏతావాతా ఎలా చూసుకున్నా.. ఇప్పుడు స‌జ్జ‌ల కేంద్రంగానే వైసీపీ రాజ‌కీయాలు సాగుతున్నాయి. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నేత‌ల‌తో భేటీ అయిన‌ప్పుడు కూడా స‌జ్జ‌ల పైనే నాయ‌కులు ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఇవి ఆరోప‌ణ‌లు కావ‌ని.. వాస్త‌వాల‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక‌, సీమ నాయ‌కులు ఎప్పుడు మీటింగ్ పెడ‌తారా? ఎప్పుడు దులిపేద్దామా? అని ఎదురు చూస్తున్నారు. ఒక‌రిద్ద‌రు అప్ప‌టి మంత్రులు మిన‌హా .. మిగిలిన వైసీపీ నాయ‌కులు అంద‌రూ కూడా.. స‌జ్జ‌ల‌పై నిప్పులు చెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News