సంక్షోభంలో టీడీపీ...అందుకే అలా....?

చంద్రబాబు జైలు పాలు అయ్యాక టీడీపీకి దిక్కు లేకుండా పోయిందని హాట్ కామెంట్స్ చేశారు.

Update: 2023-09-21 16:30 GMT

తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేనంతగా సంక్షోభంలో ఉందా. నాయకత్వం విషయంలో టీడీపీ ఇబ్బందులు పడుతోందా. టీడీపీలొ లీడ్ చేసేది ఎవరు అన్నది తెలియడంలేదా. ఇలాంటి ప్రశ్నలకు బహుశా జవాబులు అయితే ఎవరు చెబుతారో కానీ వైసీపీ అయితే టీడీపీ నాయకత్వం విషయంలో అనేక ఇబ్బందులు పడుతోంది అంటోంది.

టీడీపీని నాయకత్వ సంక్షోభం ఎంతలా ఏర్పడింది అంటే ఏకంగా పక్క పార్టీ ప్రెసిడెంట్ ని తెచ్చి బాధ్యతలను చూడమని కోరేదాకా అని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు జైలు పాలు అయ్యాక టీడీపీకి దిక్కు లేకుండా పోయిందని హాట్ కామెంట్స్ చేశారు.

అందుకోసం ఇతర పార్టీ అధ్యక్షుడి మీద ఆధారపడుతోందని అంటూ ఇండైరెక్ట్ గా జనసేన ప్రస్తావన తెచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ అయితే ఏపీలో సానుభూతి లేకపోయిందని అందుకే ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు చేయిస్తూ సానుభూతి ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు.

చంద్రబాబు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయారని, స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో 371 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని వైవీ ఆరోపించారు. తెలుగుదేశం పాలన అంతా స్కాముల మయం అని ఆయన ఫైర్ అయ్యారు. విభజన తరువాత ఏపీకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే దానిని కూడా వదులుకుని వచ్చి ఏపీకి రాజధాని అన్నదే లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదే అని ఆయన విమర్శించారు.

అక్కడికి తానేదో గ్లబల్ లీడర్ గా బాబు బిల్డప్ ఇచ్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ బాబు అరెస్ట్ ని సింపతీగా మార్చుకుందామని చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడా సక్సెస్ కావడంలేదని అన్నారు. బాబు కేసు విషయంలో కోర్టులు సరైన న్యాయమే చేస్తాయన్న నమ్మకం తమకు ఉందని వైవీ అనడం విశేషం.

అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ అవినీతి కేసులో చంద్రబాబుకు తగిన విధంగా శిక్ష పడుతుందని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు అన్నది వైవీ సుబ్బారెడ్డి మాటలను బట్టి అర్ధం అవుతోంది అంటున్నారు. అదే విధంగా టీడీపీ నాయకత్వం ఇబ్బందులు కూడా బాబు అరెస్ట్ తో ఎక్స్ పోజ్ చేసిన టీడీపీ ఆ పార్టీ అసలు బలం ఏంటో లోకానికి చూపించింది అంటున్నారు.

ఇక మరో వైపు చూస్తే ఏపీలో పాలనా రాజధానిగా విశాఖను తమ ప్రభుత్వం చాలా ముందు చూపుతో ప్రతిపాదించింది అని ఆయన అన్నారు. కేంద్రం కూడా గ్రోత్ హబ్ సెంటర్ గా విశాఖను గుర్తించిందని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖలో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News