ఏపీలో మాస్కు లేకుంటే రూ.250.. రెండోసారి రూ.500 ఫైన్

Update: 2021-03-28 07:30 GMT
వణుకు పుట్టించిన కరోనా తీవ్రత తగ్గిపోయిందని.. ముందస్తు జాగ్రత్తలు లైట్ తీసుకోవచ్చన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజల పుణ్యమా అని తాజాగా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. మొన్నటివరకు పెద్దగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవటంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయింది. ఇప్పుడు శానిటైజర్లు.. భౌతిక దూరం లాంటివే కాదు.. ముఖానికి మాస్కు కూడా వదిలేసిన వైనం ఇప్పుడు దారుణ ఫలితానికి కారణమవుతోంది.

తాజాగా ఏపీలో వెయ్యివరకు పాజిటివ్ కేసులు ఒకే రోజులో చోటు చేసుకున్నాయి. కఠిన చర్యలు తీసుకోకుంటే మరింత ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల కాలంలో మాస్కు పెట్టుకోవాలన్న నిజాన్ని మర్చిపోయిన ప్రజలకు గుర్తుకు చేయటంతో పాటు.. వారంతా తప్పనిసరిగా మాస్కులు పెట్టుకునేలాఆదేశాలు జారీ చేశారు.

శనివారం నుంచి ఏపీలోని పోలీసులు.. రోడ్లపై మాస్కు లేకుండా వెళ్లే వారికి జరిమానాలు విధించటం షురూ చేశారు. మొదటిసారి రూ.250 ఫైన్ వేసిన అధికారులు.. రెండోసారి పట్టుబడితే రూ.500 చొప్పున జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇందుకుతగ్గట్లే పలువురి మీద ఫైన్లు వేశారు. మాస్కు లేకుండా బయటకు రావొద్దని.. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దని పోలీసులు కోరుతున్నారు. రోడ్ల మీదకు వచ్చిన ప్రజలు తమతో పాటు చిన్న శానిటైజర్ ను కూడా వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణలోనూ మాస్కు లేకుండా బయట తిరిగే వారిపైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించటం తెలిసిందే.
Tags:    

Similar News