రెస్టారెంట్లో అభిమాని ఉత్సాహం.. టీమిండియాకు కొత్త కష్టం

Update: 2021-01-03 05:04 GMT
కరచాలనం ఇప్పుడు కఠినమైన సమస్యల్ని తీసుకురావొచ్చు. తెలిని వ్యక్తిని అభిమానంతో ఆలింగనం చేసుకుంటే.. అదో ఇష్యూలా మారటమే కాదు.. కఠిన చర్యలకు అవకాశం ఇస్తుంది. కరోనా కాలంలో ఇలాంటివెన్నో. తాజాగా ఒక అభిమాని ఉత్సాహం టీమిండియా క్రికెటర్లకు కొత్త సమస్యల్ని తెచ్చి పెట్టింది. ఆసీస్ టూర్ లో ఉన్న టీమిండియా సభ్యులు.. మూడో టెస్టుకు రెఢీ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో టీమిండియా సభ్యులైన రోహిత్ శర్మ.. రిషభ్ పంత్.. శుభమన్ గిల్.. నవ్ దీప్ సైనీలు లంచ్ కోసం మెల్ బోర్న్ లోని ఒక రెస్టారెంట్ కు వెళ్లి తినటం తెలిసిందే. వారు కూర్చున్న టేబుల్ దగ్గరే.. ఒక టీమిండియా అభిమాని కూర్చొని భోజనం చేశారు.

తన ఎదుట.. తన ఆరాధ్యదైవాలైన క్రికెటర్లతో కలిసి భోజనం చేయటంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. వారికి చెప్పకుండానే వారి బిల్లును తాను చెల్లించాడు. దీనికి సంబంధించిన వివరాల్ని టీమిండియా అభిమాని నవల్దీప్ సింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో.. ఆయన పోస్టు వైరల్ గా మారింది. అయితే.. తమ బిల్లును అభిమాని కట్టటంపై టీమిండియా సభ్యులు ఒప్పుకోలేదు. చివరకు తనకు వారిపై ఉన్న అభిమానాన్ని చెప్పటంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే చెప్పేశారు.

దీనికి సంబంధించిన విశేషాల్ని వెల్లడించిన నవల్దీప్ సింగ్.. నలుగురు క్రికెటర్ల బిల్లు చెల్లించటం.. వారు ఒప్పుకోకుంటే.. దాన్ని బహుమతిగా భావించాలని చెప్పానని చెప్పారు. ఈ సందర్భంగా అందరం కలిసి ఫోటో తీసుకున్నామని.. పంత్ తనను హగ్ చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ఆస్ట్రేలియా అధికారులు అలెర్టు అయ్యారు.

కోవిడ్ నేపథ్యంలో బయటకు వెళ్లటమే కాదు.. హగ్ చేసుకోవటంతో ఐదుగురినీ ఐసోలేషన్ కు పంపింది. భారత క్రికెటర్లు బయోబబుల్ రూల్ ను బ్రేక్ చేశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో.. అభిమాని నవల్దీప్ వివరణ ఇచ్చాడు. పంత్ తనను హగ్ చేసుకోలేదని.. వారిని చూసిన ఉత్సాహంతో ఆనందాన్ని తట్టుకోలేక తానే అలా చెప్పానని.. హగ్ మాటలోనిజం లేదన్నాడు. తాము సామాజిక దూరాన్ని పాటించినట్లు తెలిపారు. అభిమాని వివరణ అయితే ఓకే. మరి.. దీనికి క్రికెట్ ఆస్ట్రేలియా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News