అంతా చైనాను తిడుతున్నారు కానీ.. అసలోళ్లను వదిలేశారే?

Update: 2020-03-22 01:30 GMT
ఇవాల్టి రోజున కరోనా పేరు తో చైనాను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టేస్తున్నారంతా. కరోనాకు కారణం చైనీయులే. కానీ.. ఇవాళ ప్రపంచం కరోనాతో ఇన్ని అవస్థలు పడటానికి కారణం కేవలం డ్రాగన్ దేశమేనా? మరెవరీ పాపం లేదా? అన్న ప్రశ్నను వేసుకోవాల్సిన అవసరాన్ని మర్చిపోతున్నారు. ఒక్కసారి మూడున్నర నెలల వెనక్కి వెళ్లండి. డిసెంబరు చివరి వారంలో కరోనా గురించి కథనాలు వచ్చినప్పుడు ప్రపంచం పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే వైరస్ తీవ్రత పెరిగి..చైనాలోని రెండు.. మూడు ఫ్రావిన్స్ ల సరిహద్దుల్ని మూసేయటమే కాదు.. ప్రజారవాణాను పూర్తిగా నిషేధించటమే కాదు.. ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదన్న విపరీతమైన ఆంక్షలు విధిస్తే.. చైనాలో అంతే.. అక్కడేమైనా చేస్తారంటూ అక్కడి ప్రభుత్వాన్ని తెగ అనేశాం.

ప్రపంచమంతా ఒక పక్కకు చేరి.. తమను తిట్టిపోస్తూ.. చులకనగా మాట్లాడుతూ.. వారి ఆహార పద్దతుల్నిఅవహేళన చేస్తున్న వేళ.. వారు కన్నీళ్లు పెట్టుకున్నారే కానీ.. ప్రపంచాన్ని పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు మమ్మల్ని దోషులుగా చూస్తారు? ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏదైనా జరిగితే.. సంఘీభావాన్ని ప్రకటిస్తారు? మా విషయంలో ఎందుకిలా? అంటూ పలువురు చైనీయులు వాపోయారు.

అయినప్పటికి.. ప్రభుత్వం వారి కన్నీళ్లను.. వారి మానసిక వేదనను పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇంత జరిగినా.. తమ దేశంలో పుట్టిన కరోనా వైరస్ తమ దేశం దాటి వెళ్లేందుకు వీల్లేకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకోవటమే కాదు.. కఠినమైన ఆంక్షల్ని విధించారు కూడా. ఈ కారణంతోనే ప్రపంచానికి కరోనా వైరస్ వ్యాప్తి పెద్దగా కాలేదు. కానీ.. ఎప్పుడైతే.. యూరప్ దేశాలు.. అందునా ఇటలీకి చెందిన వారు కరోనా బారిన పడి.. పెద్దగా పట్టించుకోకుండా పార్టీలు.. పబ్బులు.. సినిమాలు.. వీకెండ్ పార్టీలు.. విహారయాత్రల పేరుతో యూరోప్ మొత్తానికి కరోనా వైరస్ అంటించటమే కాదు.. భారత్ లాంటి దేశాల్లోనూ వ్యాపింపచేయటంలో కీలక భూమిక పోషించారన్నది మర్చిపోకూడదు. తొలుత వెలుగు చూసిన కరోనా పాజిటివ్ కేసులు చాలావరకూ ఇటాలియన్లు.. వారు సంచరించిన ప్రాంతాల్లో అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇదేమీ పట్టని ప్రపంచం..కరోనా అన్నంతనే చైనాను తిట్టిపోయటమే పనిగా పెట్టుకున్నారు. అమెరికా అధ్యక్షుడు మాదిరి.. తన దేశంలో కరోనా వ్యాప్తి మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి.. కరోనాను చైనీస్ వైరస్ గా అభివర్ణిస్తూ.. సంచలనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. ఇలాంటివారు దేశాధినేతలుగా ఉంటే.. అమెరికా లాంటి దేశంలో 50 గంటల్లో వేలాదిమందికి సోకకుండా ఉంటుందా చెప్పండి?
Tags:    

Similar News