చంద్రబాబుకు షాక్ ఇస్తూ వైసీపీలోకి ఆనం..

Update: 2018-06-04 06:35 GMT
ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఆ ఆశలు నెరవేరకపోవడంతో  ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.. నెల్లూరు రాజకీయాల్లో ఆనం బ్రదర్స్  ఓ వెలుగు వెలిగారు. రాంనారాయణ రెడ్డి - చనిపోయిన వివేకానందరెడ్డి రాజకీయాలను గుప్పిట పట్టారు. ప్రస్తుతం రామనారాయణ రెడ్డి  టీడీపీలో ఏమాత్రం సంతోషంగా లేరని పరిస్థితిని బట్టి అర్థమవుతోంది.

నిజానికి కొద్దినెలల ముందే వీరు టీడీపీ లోంచి బయటకు వచ్చేద్దామని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం క్షీణించడం.. ఆయన మరణించడంతో పార్టీ మారడం రాజకీయంగా ఇప్పుడు  మంచిది కాదని ఆనం తన నిర్ణయాన్ని వాయిదా వేశారు.

ఇప్పుడు వివేకానందరెడ్డి మరణించి రెండు నెలలు గడిచిపోవడంతో రాంనారాయణ రెడ్డి టీడీపీ నుంచి బయటకు రావడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఆనం రాంనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు - సన్నిహితులు తమ కార్యకర్తలతో అంతరంగిక చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆనం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే తాను వైసీపీలో చేరుతానని వైఎస్ జగన్ తో  ఆనం  అధికారికంగా కూడా చర్చలు జరిపారని.. జగన్ సాదరంగా ఆహ్వానించడంతో వైసీపీలో తొందరలోనే చేరబోతున్నట్టు సమాచారం.

*ఆనం రాంనారాయణ రెడ్డి రాజకీయ చరిత్ర..

ఆనం రాంనారాయణ రెడ్డి నెల్లూరు రాజకీయాల్లో మూడు దశాబ్ధాలుగా కీలకంగా ఉన్నారు. 1983లో తొలిసారి నెల్లూరు అసెంబ్లీ నుంచి ఆయన టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఆథారిటీ చైర్మన్ అయ్యారు. అనంతరం ఎన్టీఆర్ పై నాదేండ్ల భాస్కర్ రెడ్డి తిరుగుబాటు చేసిన  రాజకీయ పరిణామాల్లో మరోసారి ఎన్నికలు వచ్చాయి. 1985లో ఆనం టీడీపీ టికెట్ పై రాపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలోనే నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేయడంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి ఎన్టీఆర్ తొలగించారు. ఆ స్థానంలో తొలిసారి ఆనం రాంనారాయణ రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక 1989 ఎన్నికల్లో రాంనారాయణ రెడ్డి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంది.

నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి 1991లో కాంగ్రెస్ సీఎంగా గద్దెనెక్కాక ఆనం ఫ్యామిలీ కాంగ్రెస్ లో చేరారు. 1994లో జరిగిన ఎన్నికల్లో రాంనారాయణ రెడ్డి కాంగ్రెస్ తరఫున రాపూర్ నుంచి.. వివేకానందరెడ్డి నెల్లూరు నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వీరిద్దరూ ఓడిపోయారు. ఇక 1999 - 2004 - 2009 ఎన్నికల్లో గెలిచి రాంనారాయణ రెడ్డి కాంగ్రెస్ రాజకీయాల్లో కీరోల్ పోషించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతితో 2009లో రోశయ్య ముఖ్యమంత్రిగా నియామకమైనప్పుడు రాంనారాయణరెడ్డి అనూహ్యంగా ఆర్థిక మంత్రి గా చాన్స్ దక్కించుకొని పాపులర్ అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో కూడా రాంనారాయణ కొనసాగారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడం.. రాష్ట్రం రెండుగా విడిపోవడంతో కాంగ్రెస్ లోనే ఉన్న ఆనం బ్రదర్స్ 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలం అయ్యేందుకు 2016లో టీడీపీలో చేరారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకోకపోవడం.. ఇంతవరకు వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో మనస్తాపంతో ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు. సీనియర్ నేత అనంకు టీడీపీలో ఘోర అవమానాలు ఎదురయ్యాయని ఆయనే స్వయంగా బాధపడ్డారు. దీంతో తాజాగా ఆయన్ను జగన్ అక్కున చేర్చుకుంటున్నారు. త్వరలోనే వైసీపీలో చేరేందుకు ఆనం రెడీ అయిపోయారు. టీడీపీకి ఇది షాక్ గురిచేసే పరిణామమనే చెప్పవచ్చు. టీడీపీలో నాయకులకు జరుగుతున్న అవమానాలకు ఇదో మచ్చుతునక అని వైసీపీ నాయకులు విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News