జగన్ జెట్ స్పీడ్ ...ముందస్తు పరుగులేనా...?

Update: 2022-04-26 03:30 GMT
సరిగ్గా రెండు నెలలు అవుతోంది. జగన్ జోరు మామూలుగా లేదు. ఇదివరకు మాదిరిగా ఆయన తాడేపల్లికే పరిమితం కావడంలేదు. జిల్లాల టూర్లు వరసబెట్టి చేస్తున్నారు. అదే విధంగా ప్రతీ సభలోనూ విపక్షాల మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్యలో తాను అనుకున్న పనులను కూడా ఎక్కడా బ్రేకులు లేకుండా చేస్తున్నారు.

ఇక ఏప్రిల్ నెల చూస్తే జగన్ జెట్ స్పీడ్ ఎలా ఉందో అర్ధమవుతుంది. ఇదే నెలలో కొత్త జిల్లాలను అమలులోకి తెచ్చారు. అదే స్పీడ్ లో మంత్రివర్గ విస్తరణను చేశారు. అంతే కాదు, పార్టీ పరంగా రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించారు. ఇంకో వైపు ఇంచార్జి మంత్రులను నియమించారు. ప్రతీ జిల్లాకు కొత్త అధ్యక్షులను కూడా ఎంపిక చేసి మరీ పార్టీ రూపూ షేపూ మార్చేశారు.

ఇక మరికొద్ది రోజుల్లో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళను కూడా ఏర్పాటు చేస్తారు అని తెలుస్తోంది. మొత్తానికి ముప్పయి రోజుల ఏప్రిల్ నెల జగన్ కి బాగా కలసివచ్చింది. ఆయన అనుకున్నవన్నీ చాలా జోరుగా చేశారు. ఇక ఈ నెల 27న ఆయన మంత్రులతో, పార్టీ బాధ్యులతో రీజనల్ కో ఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టారు.

అంటే జగన్ చూపు ఎన్నికల మీద ఉందని అర్ధమైపోతోంది. అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సుదీర్ఘ సమయం ఉంది. నిజానికి ఇలాంటి జోరు చూపించాల్సింది విపక్షం. అధికారంలో ఉన్న పార్టీ పవర్ ని నెమ్మదిగా ఎంజాయ్ చేస్తూ సాగాలి. కానీ ఎందుకో అధికారంలోకి వచ్చి  గట్టిగా మూడేళ్ళు నిండకుండానే జగన్ అలెర్ట్ అవుతున్నారు. ఆయన ఇప్పటి నుంచే 2024 ఎన్నికల మీద దృష్టి పెడుతున్నారు.

విపక్షాలకు ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా తానే ముందుకు దూసుకుని పోవాలనుకుంటున్నారు. ఇక ప్లీనరీ జూలైలో నిర్వహించి ఆ తరువాత తాను నిరంతరం జనాల్లోనే ఉండేలా జగన్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు. దీనిని చూసిన వారికి అయితే ఒక డౌట్ వస్తోందిట. ఏపీలో 2024లో ఎన్నికలు జరుగుతాయా లేక 2023లో జరుగుతాయా అన్నదే ఆ డౌట్.

ఇక వచ్చే ఏడాది దేశంలో కొన్ని అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి. మరి కేంద్రంలోని బీజేపీ ముందస్తు ఎన్నికల మీద ఏమి ఆలోచిస్తోందో తెలియదు. ఒకవేళ బీజేపీ ముందస్తు ఎన్నికలకు సై అంటే ఏపీ కూడా ఓకే అంటుందని అంటున్నారు. అలా కాకపోయినా వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాలలో జరిగే ఎన్నికలతో పాటుగా ఏపీలో కూడా ఎన్నికలు పెట్టించుకోవాలన్న ఆలోచన ఏమైనా వైసీపీ పెద్దలకు ఉందా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి.

దానికి అనేక రాజకీయ, సామాజిక ఆర్ధిక కారణాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయంగా చూస్తే ఇంకా విపక్షాలు గట్టిగా బలపడలేదు, వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నా అది మరీ భయపెట్టేదిగా లేదు. ఇక సామాజికంగా సమీకరణలు కూడా ఇప్పటికైతే వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. కొన్ని బలమైన కులాలలో పోలరైజేషన్ అయితే జరగలేదు. ఆర్ధికంగా చెప్పుకోవాల్సింది కూడా ఉంది.

అదేంటి అంటే ఏపీకి   పీకలలోతు అప్పులు. ఇక ఎక్కడా దొరకని పరిస్థితి. మూడేళ్ల పాటు ఎలాగోలా నెట్టుకుని వచ్చారు. ఇలా సంక్షేమ రధాన్ని కొనసాగిస్తున్నామన్న మంచి పేరు ఉండగానే ఎన్నికలకు వెళ్తే వచ్చే రిజల్ట్ వేరుగా ఉంటుంది. లేకపోతే ఆర్ధిక ఇబ్బందుల మధ్యన కొన్ని పధకాలు ఆపేసి ఎన్నికలకు వెళ్తే సీన్ రివర్స్ అవుతుంది. అందుకే వైసీపీ హై కమాండ్ తొందరపడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి జగన్ జెట్ స్పీడ్ దేనికి సంకేతమో.
Tags:    

Similar News