ఏపీలో అంతే.. నాడు డీజీపీ.. నేడు సీఎస్‌!

Update: 2022-12-15 05:30 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించవద్దని గతంలో ఏపీ హైకోర్టు స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో వీటిని నిర్మించడంపై హైకోర్టు తాజాగా మండిపడింది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డిని హైకోర్టుకు స్వయం హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు వద్దని 2020 జూన్‌లోనే హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే తాము ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేసిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అవి అక్రమ నిర్మాణాలేనని కుండబద్దలు కొట్టింది. వాటికి చెల్లింపులు సైతం అక్రమమేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము చెల్లించినందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేసి వారి నుంచి నగదు వసూలు చేస్తామని హెచ్చరించింది. పాఠశాల విద్య, పురపాలకశాఖ, పంచాయతీరాజ్‌ శాఖలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తున్నట్లు తన తాజా తీర్పులో హైకోర్టు వెల్లడించింది. వివరణ ఇచ్చేందుకు ఈనెల 22న తమ ముందు హాజరుకావాలని సీఎస్‌ను ఆదేశించింది.

ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని 2020 జూన్‌ 11న హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పేర్కొంటూ 2021లో హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో వాటిపై హైకోర్టు విచారణ జరిపింది.

ప్రభుత్వ పాఠశాలల స్థలాల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడానికి సూచనలు సలహాలు అందించేందుకు కోర్టుకు సహాయకులుగా (అమికస్‌ క్యూరీ) సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తిని హైకోర్టు నియమించింది.

పాఠశాలల్లో నిర్మాణాల తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో, ప్రస్తుత పరిస్థితి ఏమిటో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో తాజా విచారణలో ప్రభుత్వం నివేదికను కోర్టు ముందుంచింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తి నిర్మాణాల తొలగింపు విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

కాగా 239 పాఠశాలల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు ప్రారంభించామని, 63 చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వెల్లడించారు. మిగిలినచోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్టర్లకు రూ.40 కోట్లు బిల్లుల కింద చెల్లించామన్నారు. మిగిలిన పనులకు రూ. 22 కోట్లు చెల్లించాల్సి ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.

దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ స్పందిస్తూ.. విద్యార్థులు చదువుకునే వాతావరణం చెడిపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలు వద్దని ఆదేశాలిచ్చామని గుర్తుచేశారు.  

కాగా గతంలో విశాఖపట్నం పర్యటనకు బయలుదేరిన ప్రతిపక్ష నేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడంపై హైకోర్టు మండిపడ్డ సంగతి తెలిసిందే. అప్పటి డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ను హైకోర్టుకు పిలిపించి పలు సెక్షన్లను హైకోర్టు చదివించిన సంగతి తెలిసిందే.

ఇలాగే ఇప్పటివరకు పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్‌ అధికారులు సైతం నిబంధనల ఉల్లంఘన, కోర్టు ధిక్కరణ కేసుల్లో హైకోర్టుకు హాజరయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News