సుప్రీంకోర్టులో తెలంగాణపై ఏపీ ప్రభుత్వం పిటిషన్‌!

Update: 2022-12-14 14:08 GMT
జగన్‌ ప్రభుత్వం తెలంగాణపై సుప్రీంకోర్టుకెక్కింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రూ.1,42,601 కోట్ల విలువైన ఆస్తులను విభజించకుండా తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని జగన్‌ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.


రెండు రాష్ట్రాల మధ్య విభజన జరగాల్సిన 91 శాతం ఆస్తులు హైదరాబాద్‌ లోనే ఉన్నాయని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచినా ఆస్తుల విభజనకు తెలంగాణ సర్కార్‌ సహకరించడం లేదని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్‌ లో పేర్కొంది. న్యాయమైన, సమానమైన ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 14, 21 ప్రకారం.. ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిదని ఏపీ తన పిటిషన్‌ లో ఆరోపించింది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనకు తామెంత ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తుందని పిటిషన్‌ ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.

కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. వీటి పరిష్కారానికి ఎన్ని సమావేశాలు నిర్వహించినా ఫలితం మాత్రం శూన్యం.

కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిసారీ రెండు రాష్ట్రాల వాదనలు వినడమే తప్ప.. పరిష్కారం చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమైనా సమస్యలను పరిష్కరించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలా భిడే నిపుణుల కమిటీ 9వ షెడ్యూలులోని 90 సంస్థలపై కేంద్రానికి నివేదికలు సమర్పించింది.
అయితే ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలపై రెండు రాష్ట్రాల మధ్య విభేదాలున్నాయి.


దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ, డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కాకుండా పెండింగ్‌ లోనే ఉండిపోయాయి.

ఇక 10వ షెడ్యూలులోని సంస్థలకు సంబంధించి నగదు నిల్వలను జనాభా ప్రాతిపదికన పంచుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ సర్కారు దీనికి కూడా అంగీకరించకుండా హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇది కూడా పెండింగ్‌ లోనే ఉంది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ కోరుతోంది. ఇలా రెండు రాష్ట్రాలు ఎవరి వాదనను వారు వినిపిస్తుండడంతో చాలా సమస్యలకు పరిష్కారం అభించడం లేదని అంటున్నారు.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన తాజా పిటిషన్‌ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News