విమానాశ్రయాల ప్రైవేటీకరణకు సిద్ధం

Update: 2022-03-22 05:31 GMT
రాష్ట్రంలోని మూడు విమానాశ్రయాలను మూడేళ్ళల్లో ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నట్లు పౌర విమానయానశాఖ మంత్రి వీకే సింగ్ పార్లమెంటులో తెలిపారు. విమానాశ్రయాల మానిటైజేషన్ (ప్రైవేటీకరణ) జాబితాలో ఏపీలోని మూడు విమానాశ్రయాలున్నట్లు మంత్రి చెప్పారు.

కేంద్ర మంత్రి స్వయంగా పార్లమెంటులోనే ప్రకటించారు కాబట్టి కచ్చితంగా ఏదో రోజు విమానాశ్రయాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవటం ఖాయం. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రక్రియ ఊపందుకుంటోంది. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒకవైపు ఫ్యాక్టరీ ఉద్యోగులు, కార్మికుల ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్నాయి. వీళ్ళకు వైజాగ్ పురప్రజలు, ప్రజా సంఘాలు కూడా మద్దతుగా నిలిచారు. అయినా కేంద్రం మాత్రం తన నిర్ణయం ప్రకారం ముందుకే వెళుతోంది.

ఇదే పద్దతిని విమనాశ్రయాల ప్రైవేటీకరణ విషయంలో కూడా ఫాలో అవుతుందనటంలో సందేహం లేదు. అసలు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడే జనాలు కూడా ఉండరు. ఎందుకంటే విమానాశ్రయాలనేవి మామూలు జనాలకు ఏమాత్రం సంబంధం లేనివి. కాబట్టి విమానాశ్రయాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నా, ప్రైవేటువ్యక్తుల చేతుల్లో ఉన్నా మామూలు జనాలకు ఒకటే. కానీ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విషయం అలా కాదు.

ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా 20 వేలమంది ఉద్యోగ, కార్మికులు పరోక్షంగా మరో 20 వేలమంది ఆధారపడుతున్నారు. పైగా జై ఆంధ్రా మూమెంటుతో ఎందరో ప్రాణాలను బలిచ్చి సాధించుకున్న ఫ్యాక్టరీ. అందుకనే ఫ్యాక్టరీతో మామూలు జనాలకు మానసిక బంధముంది. ఇంతేకాకుండా ఫ్యాక్టరీ మంచి లాభాలతో నడుస్తోంది. రికార్డుస్ధాయిలో ఉత్పత్తి సాధిస్తోంది. ఏ రకంగా చూసినా ప్రైవేటీకరించాల్సిన అవసరం లేనేలేదు. అయినా కేంద్రం తన నిర్ణయంతో ముందుకెళుతోంది. అలాంటిది నష్టాల్లో ఉన్న  విమానాశ్రయాలను వదిలించుకోకుండా ఎందుకుంటుంది. కాకపోతే మామూలు జనాలతో సంబంధం లేని వ్యవహారం కాబట్టి ఎవరు పట్టించుకోవటంలేదు. మరి తన హయాంలో నరేంద్ర మోడీ ఇంకా ఎన్ని రంగాలను ప్రైవేటీకరిస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News