వీర విధేయత.. జగన్ ను అంటే నాలుక కోసేస్తాం.. తేల్చిన మంత్రి

Update: 2022-09-09 03:03 GMT
ప్రభుత్వాన్ని.. నన్ను విమర్శలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు ఉన్నది ఎందుకు? ప్రతిపక్షం విమర్శలు చేస్తుంటే మౌనంగా ఉంటారా? అందుకేనా మీరు ఉన్నది? అంటూ ఇటీవల జరిగిన కేబినెట్ లో సహచర మంత్రులకు క్లాస్ పీకిన నేపథ్యంలో.. ఆ మాటల ప్రభావం ఏపీ మంత్రుల మీద భారీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో చెలరేగిపోతున్నారు వైసీపీ మంత్రులు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తనకున్న విధేయతను ప్రదర్శించటానికి ఆయన దేనికైనా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆవేశంతో ఊగిపోతూ.. ముఖ్యమంత్రి జగన్ ను ఏమైనా అంటే నాలుక కోసేస్తామన్న స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేశారు.

చంద్రబాబు పాలనలో కంటే జగన్ పాలనలోనే రాష్ట్రంలోని ఎస్సీలు సంతోషంగా ఉన్నరన్న ఆయన.. జగన్ ఎస్సీ వ్యతిరేకి అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు.

ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు లోకేశ్ కు లేదన్న ఆయన.. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం జగన్ స్కారు చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని టీడీపీ నేతలు పదే పదే విమర్శిస్తున్నారని.. ఆయన దేశానికి ఆణిముత్యం లాంటి నాయకులను అందించారన్నారు.

నెల్లూరులో ఎస్సీలపై జరుగుతున్న దాడులపై జాతీయ ఎస్సీ కమిషన్ అగ్రహం వ్యక్తం చేసిన వైనాన్ని ప్రస్తవించగా.. కమిషన్ వాళ్లేమీ దేవుళ్లు కాదని.. వారు ఏపీకి వచ్చిన స్థానిక పరిస్థితుల్ని చూడాలన్నారు.

జగన్ ను కీర్తిస్తూ.. ఆయన పట్ల వీర విధేయతను ప్రదర్శించటమే కాదు.. ఆయన్ను పల్లెత్తు మాట అన్నా ఊరుకునేది లేదన్న విషయాన్ని తనదైన శైలిలో చెప్పిన మేరుగ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News