యాపిల్ కంపెనీకి దిమ్మ తిరిగే షాకిచ్చిన ఆ దేశ వినియోగదారుల ఫోరం

Update: 2021-03-22 04:31 GMT
రోజులు గడిచే కొద్దీ.. మెదడు మోకాలిలోకి వెళ్లే ఆలోచనలు చేస్తుంటాయి కొన్ని కంపెనీ. ఖర్చులు తగ్గించుకునే కక్కుర్తికి పర్యావరణం పేరుతో వారు వేసే యేషాలు మామూలుగా ఉండవు. పర్యావరణం మీద అంత మక్కువే ఉంటే.. దాని పరిరక్షణ కోసం భారీగా బడ్జెట్ కేటాయింపులు చేస్తే సరిపోతుంది. అలాంటి విషయాల్ని వదిలేసి.. పర్యావరణ పరిరక్షణ కోసం ఫోన్ తో పాటు ఛార్జర్ ఇవ్వని కొత్త సంప్రదాయానికి తెర తీశాయి కొన్ని కంపెనీలు. గతంలో హియర్ ఫోన్లను ఇచ్చే సెల్ కంపెనీలు.. తర్వాతి కాలంలో వాటిని ఇవ్వటం మానేశాయి. తాజాగా ఛార్జర్లు ఇవ్వట్లేదు.

అలాంటి కంపెనీల్లో టెక్ దిగ్గజం యాపిల్ కూడా ఒకటి. తన ఐఫోన్ 12కు చార్జర్లు ఇవ్వటం మానేసింది ఆ కంపెనీ. దీంతో బ్రెజిల్ లో యాపిల్ ఫోన్ కొన్న వినియోగదారుడు.. ఆ కంపెనీపై వినియోగదారుల ఫోరంలో కేసు వేశాడు. ఐఫోన్ 12 మినీ మొబైల్ ధర అమెరికాలో 729 డాలర్లు అయితే.. అదే ఫోన్ ను బ్రెజిల్ లో మాత్రం 1200 డాలర్లకు విక్రయిస్తున్నారు. ఇంత ధర వసూలు చేసి కూడా చార్జర్ ఎందుకు ఇవ్వరంటూ ఒక వ్యక్తి అక్కడి వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

దీనిపై ఫోరం మండిపడింది. ఫోన్ కు చార్జర్.. హెడ్ సెట్ ఇవ్వకపోవటంతో వినియోగదారులు నష్టపోతున్నారని పేర్కొంటూ మన రూపాయిల్లో రూ.15 కోట్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది. చార్జర్ ఇవ్వకుండా ఫోన్ అమ్మటం సరికాదని.. ఒకవేళ చార్జర్ ఇవ్వని పక్షంలో ధర తగ్గించాలి కదా? అని ప్రశ్నించింది. బ్రెజిల్ చట్టాలు.. నియమాలకు లోబడి కంపెనీలు తమ ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకురావాలని.. వినియోగదారుల చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయన్న విషయాన్ని యాపిల్ కంపెనీ అర్థం చేసుకోవాలంటూ ప్రోకాన్ ఎస్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెర్నాండో కాపెజ్ పేర్కొన్నారు. తనకు ఎదురైన చేదు అనుభవం నేపథ్యంలో యాపిల్ ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.
Tags:    

Similar News