ఏపీఎస్ ఆర్టీసీ ఇంత దుస్థితికి దారితీస్తుంది: ఎండీ సంచలన కామెంట్స్

Update: 2022-05-05 03:48 GMT
ఏపీఎస్ ఆర్టీసీ దుస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించారు ఆ సంస్థ ఎండీ .ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తామన్న వార్తలపై నేరుగా స్పందించారు. ఆర్టీసీ అద్దె బస్సుల సంఖ్యను పెంచడంపై కూడా వివరణ ఇచ్చారు. ఏపీఎస్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా లేదని.. కొత్త బస్సులు కొనడం కొంత ఇబ్బందిగా మారడంతోనే 998 అద్దె బస్సులకు టెండర్లు పిలిచినట్లు వివరించారు. అద్దె బస్సులు ఇవ్వాలనుకునే యజమానులు ఖచ్చితంగా కొత్తవే ఇవ్వాలని స్పష్టం చేశారు.

మొదటిసారిగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులు చేస్తున్నామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. అద్దె బస్సుల సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ ఆ బస్సుల యజమానులదేనన్నారు. అద్దె బస్సుల వల్ల ఏ ఒక్క ఉద్యోగి భద్రతకు భంగం వాటిల్లదని తెలిపారు. ఇక ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ఆర్టీసీ అంత దిగజారలేదని ఆయన తెలిపారు.

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ సీసీఎస్ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఏపీ ఆర్టీసీ ఆ బకాయిలు చెల్లించింది. ఇప్పటివరకూ రూ.1685 కోట్ల అప్పులు తీర్చామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. అద్దె బస్సులు విధులకు రాకపోయినా మేం బస్సులు నడపగలమన్నారు. మేం నిస్సహాయ స్థితిలో లేమన్నారు. పెనాల్టీలు కఠినంగా ఉంటేనే ప్రజలకు ఉపయోగం అన్నారు.

ఇక జనవరి 2016-2019 డిసెంబర్ వరకూ ఉన్న కారుణ్య నియామకాలకు ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు. 2020 జనవరి తర్వాత ఉన్న కారుణ్య నియామకాలకు సిద్ధం చేస్తున్నామన్నారు. కారణ్య నియామకాలు చేయాల్సిన లిస్టు సంబంధిత కలెక్టర్లకు పంపించామని వివరించారు. అద్దె బస్సుల టెండర్లకు గడువు పెంచినట్లు వివరించారు.

అద్దె బస్సుల సంఖ్య పెంచడం వల్ల వాణిజ్య పరంగా ఆర్టీసీకి లాభమేనని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 23శాతం అద్దె బస్సులున్నాయని.. కొత్త వాటిని తీసుకోవడం ద్వారా 32శఆతం అద్దె బస్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అద్దె బస్సుల పెంపుతో ఆర్టీసీ ప్రైవేటు వాళ్ల చేతుల్లోకి వెళుతుందనేది అవాస్తవమని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ప్రస్తుతం సొంత బస్సులు కొనే స్థోమత ఆర్టీసీకి లేదని తెలిపారు.
Tags:    

Similar News