వైసీపీలో జగన్ తర్వాత ఆ ఇద్దరిదే హవానా?

Update: 2022-04-20 04:51 GMT
ఒకటి తర్వాత ఒకటి చొప్పున నిర్ణయాల్ని తీసుకుంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటు పార్టీ.. ఇటు ప్రభుత్వ వ్యవహారాల విషయంలో ఆయన వరుస పెట్టి నిర్ణయాల్ని తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి మొహమాటాలకు తావివ్వకుండా వ్యవహరిస్తున్న ఆయన.. కొందరు ముఖ్యులు.. సన్నిహితులకు సైతం పదవుల నుంచి పక్కన పెట్టేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? అన్నంతనే.. పలు రకాల చర్చలు వస్తాయి. చర్చ ఏదైనా చివరకు తేలేది మాత్రం ముగ్గురు పేర్లే. వారే.. విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి. వీరు ముగ్గురు జగన్ కు కీలకంగా చెబుతారు. ఏం చేసినా.. వీరి ముగ్గురికి సమాచారం ఉంటుందని.. వీరిని సంప్రదించే నిర్ణయాలు ఉంటాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. విచిత్రమైన విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ఈ ముగ్గురిలో ఎవరి స్థానం ఎంతన్నది ఇప్పటివరకు స్పష్టం చేయలేదు.

అలాంటిది తాజాగా మాత్రం ఆయన తీసుకున్న నిర్ణయం.. ఇప్పటివరకు ఉన్న కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టేలా చేసిందని చెప్పాలి. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల ఎంపిక వేళ.. జగన్ ప్రాధాన్యత క్రమం మీద అవగాహనతో పాటు.. తాను ఎవరికి ఎంత వెయిట్ ఇస్తున్నాన్న విసయాన్ని అర్థమయ్యే సంకేతాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ప్రకటించిన ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల్ని అప్పగించిన తీరును చూశాక.. పార్టీలో తన తర్వాత నెంబర్ టూ ఎవరన్న విషయాన్ని పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తనకు తలలో నాలుక మాదిరి ఉండటం.. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఎదురయ్యే పరిస్థితుల్ని ఫేస్ చేయటం లాంటి రిస్కు తీసుకుంటున్న సజ్జల రామక్రిష్ణారెడ్డి పార్టీలో నెంబరు2 అన్న విషయాన్ని తేల్చేశారు జగన్మోహన్ రెడ్డి.

తన తర్వాత పార్టీలోనూ.. ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జలకు సీఎం జగన్ పెద్ద పీట వేయటమే కాదు.. నెంబర్ 2 పొజిషన్ ఇచ్చేశారని చెప్పాలి. ఇప్పటికి ఆయనకున్న పదవులు.. బాధ్యతలకు అదనంగా ప్రాంతీయ బాధ్యతల్ని అప్పజెప్పారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తో కలిసి కర్నూలు, నంద్యాల జిల్లాల్నిచూసుకోవాల్సి ఉంటుంది. నిజానికి.. ఈ రెండు జిల్లాలకు సజ్జలను ఎంపిక చేసిన తర్వాత ఆయనకే పూర్తిగా అప్పజెప్పేయొచ్చు. కానీ.. ఇప్పటికే ఉన్న బాధ్యతల బరువు ఆయనకు శిరోభారంగా మారకుండా ఉండేందుకు వీలుగా.. బుగ్గనను సహాయకారిగా నియమించారని చెబుతున్నారు.

ఓవైపు రెండు జిల్లాలకు ప్రాంతీయ సమన్వయ బాధ్యతలు అప్పజెప్పిన సజ్జలకు ఇప్పటికే పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలందరినీ.. జిల్లాల అధ్యక్షులను సమన్వయం చేస్తున్నది సజ్జల మాత్రమే. పార్టీ పరంగానే కాదు.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన ఎంత కీలకంగా ఉన్నారో తెలిసిందే. ఏతా వాతా తేలేదేమంటే.. వైసీపీలో జగన్ తర్వాత పార్టీలో హవా మొత్తం సజ్జలదే అన్న విషయాన్ని తాజా పరిణామంతో స్పష్టమైందని చెప్పక తప్పదు. ఆ తర్వాతి స్థానం వైవీ సుబ్బారెడ్డిగా చెబుతున్నారు.
Tags:    

Similar News