ప‌వ‌న్ కోస‌మే జైట్లీ లెక్క‌లు చెప్పారా?

Update: 2016-10-29 04:33 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఇప్ప‌టికి హాట్ హాట్ వ‌లే కొన‌సాగుతున్న పాయింట్ ఏదైనా ఉందా అంటే అది ఏపీకి ప్ర‌త్యేక హోదా ఒక్క‌టే. అధికార టీడీపీ-బీజేపీ కూట‌మి స్పెష‌ల్ స్టేట‌స్‌ ను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ప్ర‌తిప‌క్ష వైసీపీ - కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం హోదా విష‌యంలో స‌ర్దుకుపోయేదే లేద‌ని స్ప‌ష్టం చేస్తున్న క్ర‌మంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప‌రోక్షంగా ఈ నేత‌లందరికీ స‌మాధానం ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో త‌న‌ను స‌న్మానించి సంద‌ర్భంగా అరుణ్ జైట్లీ లెక్క‌ల‌న్నీ వివ‌రించారు. ప్రత్యేక ప్యాకేజీతో వచ్చే నిధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది దేశంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆకాంక్షించారు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ కు న్యాయం చేసేందుకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాకపోవడం వల్ల దాని కంటే అధికంగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు జైట్లీ చెప్పారు. కేంద్రం అందించిన ఆర్థిక సాయాన్ని గురించి రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోవాలని అరుణ్ జైట్లీ అన్నారు. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని విధంగా అభివృద్ధి చెంది దేశానికే తలమానికం కాగలదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనను తన స్వప్రయోజనాల కోసం వాడుకుందని జైట్లీ ఆరోపించారు. నాటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదా ఇస్తామని అన్నా చట్టంలో పొందుపరచలేదన్నారు. 13వ ఆర్థిక సంఘం వల్ల 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్రం నుంచి రూ.34,978 కోట్లు - 2009-14లో రూ.69వేల కోట్లు నిధులు విడుదలయ్యాయన్నారు. కానీ 14వ ఆర్థిక సంఘం వల్ల రూ.2,03,100 కోట్లు నిధులు ఆంధ్రప్రదేశ్‌ కు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్థికలోటు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఐటి - ఎన్‌ ఐటి - త్రిపుల్ ఐటి - ఐఐఎస్‌ ఇఆర్ - ఐఐఎం - ఎయిమ్స్ వంటి విద్యాసంస్థలు ఇప్పటికే ఏర్పడ్డాయని - సెంట్రల్ యూనివర్సిటీ - ట్రైబల్ యూనివర్సిటీ - నేషనల్ ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌ మెంట్ తదితర సంస్థలు త్వరలో ఏర్పాటు కానున్నాయన్నారు. స్టీల్ ప్లాంటును విస్తరిస్తున్నామని, ఆంధ్రలోని విమానాశ్రయాల ఆధునీకరణ ఇప్పటికే జరిగిందని, రూ.65 వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారులు నిర్మించడం జరుగుతుందని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని అరుణ్ జైట్లీ చెప్పారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ప్రాజెక్టులు - నిధులు కేటాయించినట్టు వెల్లడించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్యాకేజీని రూపొందించటంలో జైట్లీ కృషి ప్రశంసనీయమన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్‌ సింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.2.25 లక్షల కోట్లు ప్రకటించినందుకు ఆర్థిక మంత్రి జైట్లీకి రాష్ట్ర శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అయితే స‌భా ముఖంగా బీజేపీ నేత‌లంతా పార్టీ ఏపీకి చేసిన స‌హాయాన్ని ఏక‌రువు పెట్ట‌డం వెనుక కార‌ణం...హోదా బ‌దులుగా ఏపీకి ఏం చేయ‌లేద‌నే ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు స‌మాధాన‌మేన‌ని ప‌లువురు భావిస్తున్నారు. దీంతో పాటు ప్ర‌తిపక్షాలు సైతం తెలుసుకుంటే మంచిద‌నే కోణంలోనే ఈ లెక్క‌లు వివ‌రించిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News