మోడీ.. రాహుల్ మధ్య డీల్ అంటున్న సీఎం

Update: 2016-12-17 09:28 GMT
మోడీ అంటేనే మండిపడే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మధ్య డీల్ జరిగిందన్న భావన కలుగుతుందన్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ మారాయి. మోడీ మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిన వెంటనే రాహుల్ తో మోడీ భేటీ కావటం.. అనంతరం రాజకీయ పార్టీలు ఎంత మొత్తం పాత నోట్లను డిపాజిట్ చేసినా.. దానిపై ఎలాంటి విచారణ ఉండదంటూ కేంద్రం నిర్ణయం తీసుకోవటంపై ఆయన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాత నుంచి రాహుల్ సైతం.. ఆయనపై ఏమీ మాట్లాడటం లేదని.. ఇదంతా చూస్తుంటే.. వారిద్దరి మధ్య ఏదైనా డీల్ కుదిరిందన్న భావన కలుగుతోందన్న వ్యాఖ్య చేశారు. గడిచిన ఐదేళ్లలో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ తీసుకున్న విరాళాల మీద విచారణ జరపాలంటూ డిమాండ్ చేసిన కేజ్రీవాల్.. రూ.20వేల కంటే తక్కువ విరాళం ఇస్తే అందుకు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదన్న పరిమితిని ఎత్తేయాలన్నారు.

పెద్దనోట్లను పార్టీలు డిపాజిట్ చేసిన తర్వాత అన్ని పార్టీల డిపాజిట్ వివరాల్ని వెల్లడించాలన్నారు. రాజకీయ పార్టీలు ఎన్ని లక్షల కోట్ల రూపాయిలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినా ఎలాంటి విచారణ ఉండదంటూ మోడీ సర్కారు తీసుకున్ నిర్ణయంపై విచారణ వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ చీఫ్.. ఇదేమాత్రం సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు బీజేపీ ఎన్ని భూములు కొన్నది.. ఎన్ని వాహనాలు కొన్నది చెప్పాలన్న డిమాండ్ చేసిన ఆయన.. తమ పార్టీ డిపాజిట్లు.. రశీదు పుస్తకాల్ని అధికారులు తనిఖీ చేస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ తాము భయపడటం లేదని కేజ్రీవాల్ వెల్లడించారు. మోడీ మీద వ్యక్తిగత ఆరోపణలు చేసిన రెండో రోజే రాహుల్.. తన పరివారంతో కలిసి వెళ్లి మోడీని కలవటం.. ఆ తర్వాత ఆయన నోరు విప్పకపోవటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్న వేళ.. కేజ్రీవాల్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News