ధ్యానంతో దండెత్త‌నున్న సీఎం

Update: 2016-08-13 08:10 GMT
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ల‌క్ష్యాలు నిర్దేశించుకుంటున్నారు. ఆధ్యాత్మిక కేంద్రం ధర్మశాలలో 10 రోజుల పాటు ప్రత్యేక 'విపస్సన' తరగతుల్లో పాల్గొని ధ్యానంపై శిక్షణ తీసుకుని ఢిల్లీకి చేరుకున్న కేజ్రి త‌ర్వాతి కార్యాచ‌ర‌ణ‌పై దృష్టిపెట్టారు. త్వరలో జరగనున్న పంజాబ్ - గుజరాత్ - గోవా అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి ని సారించాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు సాధ్యమైనంత ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించాలన్నది కేజ్రీవాల్ ఆలోచనగా తెలుస్తోంది. పంజాబ్‌ పై గట్టి ఆశలు పెంచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మంచి ప్రజల మద్దతును కూడా పొందినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూను ఈ కోణంలోనే బీజేపీకి - ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేయించిన సంగ‌తి తెలిసిందే.

మ‌రోవైపు ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్ దృష్టి ప్రధానంగా పంజాబ్‌ పైనే ఉంటుందని అంచనా. గోవా బాధ్యతలను ఉప ముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా - ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ లకు అప్పగించాలని కేజ్రీవాల్ అనుకుంటున్నట్లు స‌మాచారం. గుజరాత్ బాధ్యతలను మంత్రి కపిల్ మిశ్రా - మాజీ ఎడిటర్ అశుతోష్ భుజాలపై పెడతారని తెలుస్తోంది. నెలలో రెండు వారాల పాటు ఢిల్లీలో - మిగిలిన రెండు వారాలను రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేజ్రీవాల్ కేటాయించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆప్ దేశ‌వ్యాప్త విస్త‌ర‌ణ ల‌క్ష్యంగా పెట్టుకున్న కేజ్రివాల్ ఇటీవ‌లి కాలంలో తెలుగు రాష్ట్రాల‌పై సైతం దృష్టిసారించారు. పార్టీ ద‌క్షిణాది రాష్ట్రాల ఇంచార్జీ సోమ్‌ నాథ్ భారతీ ఇటీవ‌ల ఏపీలో ప‌ర్య‌టించారు. నెల్లూరు - చిత్తూరులో పార్టీ కార్యాక‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా రాబోయే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఏపీలో మెరుగైన స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని భ‌రోసా వ్య‌క్తం చేశారు.
Tags:    

Similar News