బాలయ్యకు తత్వం బోధపడింది... బావ మాట వినలేదు

Update: 2019-10-19 17:41 GMT
తెలంగాణలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక దాదాపుగా అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగానే మారిందని చెప్పాలి. తెలంగాణలోని ప్రధాన పార్టీలతో పాటుగా... దాదాపుగా అక్కడ తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ కూడా తన అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే ఆ అభ్యర్థి విజయం కోసం స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాత్రం పనిచేయడం లేదన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగానే మారిపోయింది. తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా... టీడీపీ తరఫున బాలయ్య కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మాత్రం బాలయ్య ఆ బాధ్యతలను చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. స్వయంగా తన బావ, పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేసినా కూడా బాలయ్య హుజూర్ నగర్ వైపు దృష్టి సారించేది లేదని తేల్చేశారు. తేల్చేయడమే కాదు... ఎన్నికల ప్రచారం ముగిసినా బాలయ్య హుజూర్ నగర్ లోనే కాలుపెట్టలేదు.

బాలయ్య వ్యవహరించిన ఈ తరహా వ్యూహంపై ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పార్టీ జయాపజయాలపై చంద్రబాబు తనదైన మార్కు వ్యూహాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ గెలిస్తే... ఆ క్రెడిట్ అంతా తనదేనని, అదే పార్టీ ఓటమి పాలైతే... ఆ బాధ్యత తనది కాదని, పార్టీ నేతలదేననే రీతిలో వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పటికే పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల అధినేతలు ప్రచార బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు అక్కడికి వెళ్లకుండా తనకు బదులుగా బాలయ్యను పంపుతానంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై గతంలోనే విమర్శలు రేకెత్తాయి. అంతేకాకుండా హుజూర్ నగర్ లో టీడీపీకి గెలుపు కాదు కదా... కనీసం డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలిసినా... బాలయ్యను ప్రచారానికి పంపుతానంటూ ప్రకటించారు. చంద్రబాబు చెప్పినప్పుడు హుజూర్ నగర్ ప్రచారానికి వెళతానని ఒప్పేసుకున్న బాలయ్య... ఆ తర్వాత అక్కడి పరిస్థితులపై ఆరా తీసి చంద్రబాబుకు చెప్పాపెట్టకుండానే ప్రచారానికి డుమ్మా కొట్టేశారు.

ఈ నేపథ్యంలో బాలయ్య వ్యవహరించిన తీరుపై సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యూహంతో పాటుగా హుజూర్ నగర్ లో పార్టీ స్థితిగతులను బేరీజు వేసుకున్న తర్వాతే బాలయ్య అక్కడి ప్రచారానికి వెళ్లలేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఓడిపోయే అభ్యర్థి కోసం తానెందుకు ప్రచారం చేయాలి? పోనీ... తాను ప్రచారం చేసినా పార్టీ అభ్యర్థికి పడే ఓట్లలో ఏమైనా పెరుగుదల కూడా కనిపించే పరిస్థితి లేదన్న కోణంలో బాలయ్య ఆలోచించారట. అంతేకాకుండా వాస్తవ పరిస్థితులు తెలిసి కూడా చంద్రబాబు తనను హుజూర్ నగర్ ప్రచారానికి వెళ్లాలని ఆదేశించడంపైనా బాలయ్య ఒకింత ఆగ్రహానికి గురవుతున్నట్లుగా కూడా సమాచారం. మొత్తంగా హుజూర్ నగర్ ఎన్నికల సందర్భంగా బాలయ్యకు తత్వం బోధపడిందని, ఇకపై చంద్రబాబు చెబితే గుడ్డిగా ముందుకు దూకే పరిస్థితి లేదన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి తన వ్యూహం గురించి బాలయ్యకు తత్వం బోధపడిందన్న విషయాన్ని బాబు ఎప్పుడు గమనిస్తారో చూడాలి.
Tags:    

Similar News