ఆ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి

Update: 2021-07-19 05:23 GMT
ఆంధ్రప్రదేశ్ లో సచివాలయాల పనితీరు మాత్రం బాగుంది. కానీ, ఆ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది వ్యవహారమే అంతు చిక్కకుండా ఉంది. బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా ఇంకా 50 శాతం మంది కూడా సరిగ్గా సమయానికి సచివాలయాలకు రాని పరిస్థితి. మిగతా వారంతా ఆన్ డ్యూటీ అంటూ రిజిస్టర్ లో రాసి వెళ్లిపోతున్నారు. దీనికిప్పుడు బ్రేక్ వేయాలని చూస్తోంది సీఎంఓ కార్యాలయం. సచివాలయ ఉద్యోగుల హాజరు ఈ రోజు నుంచి 90 శాతం ఉండాలని, అలా లేని పక్షంలో ఎంపీడీవోలని బాధ్యుల్ని చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

గ్రామ, వార్డు సచివాలయాల కోసం కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగుల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. వారంతా ఉదయం, సాయంత్రం అటెండెన్స్ వేసుకునే బయటపడేవారు. కానీ అప్పటికే సీనియర్లు అయిన వీఆర్వోలు, గ్రేడ్-2 పంచాయతి సెక్రటరీలు, ఏఎన్ ఎం లు.. మాత్రం ఆన్ డ్యూటీ అంటూ సచివాలయాలకు మొహం చాటేసేవారు. నిజంగా వేరే పని ఉంటే ఓకే, కానీ పనిలేకపోయినా ఆన్ డ్యూటీ అనే పదం అలవాటు చేసుకున్నారు. ఇటీవల మహిళా కానిస్టేబుళ్లు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్లడం, అక్కడి డ్యూటీలు చేయడం అలవాటు చేసుకున్నారు. దీంతో కొత్త రిక్రూటీలు కూడా కాలరెగరేస్తున్నారు. అందరూ ఆన్ డ్యూటీ అనేస్తూ సచివాలయాలకు మొహం దాటేస్తున్నారు.

రాష్ట్రంలో గ్రామంలో సచివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్తే డిజిటల్ అసిస్టెంట్ మినహా ఇంకెవరూ కనిపించరు. దీనితో ఇటీవల కాలంలో సచివాలయాలపై చాలా కంప్లయింట్లు వచ్చాయి. పట్టణాల్లో ఉండే వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు బాగానే అమలు అవుతుంది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో సీఎం ఆఫీస్ నేరుగా జోక్యం చేసుకుంది. జులై 1 నుంచి బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలిస్తామని చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు రెండోసారి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు నుంచి బయెమెట్రిక్ హాజరుతోనే జీతాలని తెగేసి చెప్పేశారు. ఆన్ డ్యూటీ పేరుతో ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లే వీఆర్వోలకు, ఊరిలోనే ఉండిపోయే ఏఎన్ ఎం  లకు, పోలీస్ స్టేషన్లకు వెళ్తున్న మహిళా కానిస్టేబుళ్లకు డిప్యుటేషన్లు రద్దు చేశారు. అందరూ కచ్చితంగా సచివాలయానికి రావాలని, ఆ తర్వాత ఎక్కడైనా పనులుంటే వెళ్లి రావాలని, సాయంత్రం తిరిగి వెళ్లేటప్పుడు కూడా సచివాలయంలో బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశాలిచ్చారు.  

అలాగే సెలవులకు దరఖాస్తును ఇక నుంచి హెఆర్‌ఎంఎస్‌లోనే చేసుకోవాలని స్పష్టం చేశారు. అటు ప్రతీ రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి ప్రజల వినతులను తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు డ్యూటీలో భాగంగా సమావేశాలకు లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా మూమెంట్ రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని భరత్ గుప్తా తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులు బయోమెట్రిక్‌ ఒక సారికి, రెండో సారి వేయడానికి కనీసం రెండు గంటల గ్యాప్‌ ఉండాలని పేర్కొన్నారు. కార్యాలయాల పనివేళల్లో డిజిటల్‌ అసిస్టెంట్, వార్డు విద్య అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సమావేశాలు, లేదా విధుల్లో భాగంగా ఎక్కడికైనా వెళితే మూమెంట్‌ రిజిష్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, రేపట్నుంచి బయోమెట్రిక్ హాజరు అమలయ్యేలా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని సూచించారు.  
 
Tags:    

Similar News