ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేకు జీవితఖైదు

Update: 2019-12-20 11:24 GMT
ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా తేలిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు తీర్పు ని వెల్లడించింది. ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సెంగార్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు బాధితురాలికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బాధితురాలికి ప్రాణభయం ఉంటే ఆమెకు రక్షణ కల్పించాలని, బాధితురాలు, ఆమె కుటుంబం ఉండడానికి సురక్షితమైన నివాసం ఏర్పాటు చేయాలని సీబీఐని తీస్ హజారీ కోర్టు ఆదేశించింది.

 2017 నాటి ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపిన తీస్ హజారీ కోర్టు ఈనెల 16న కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చింది. అనంతరం దోషికి జీవిత ఖైదు శిక్షను ఈరోజు ఖరారు చేసింది. సెంగార్ మీద అత్యాచారం కేసు, బాలిక మీద లైంగిక దాడి కేసు, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2017లో అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలు మైనర్ కావడంతో కుల్దీప్ సెంగార్ మీద పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు.

ఉన్నావ్‌లో 2017 సంవత్సరంలో ఓ మైనర్ బాలిక  ఉద్యోగం కోసం స్థానిక ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ ఇంటికి వెళ్లగా ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత కూడా కొందరు వ్యక్తలు ఆమెను కిడ్నాాప్ చేసి పలుమార్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తన బలం, బలగంతో బాధితురాలి ఫ్యామిలీపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తండ్రిని తీవ్రంగా గాయపర్చడంతో పాటు అక్రమ ఆయుధాల కేసును పెట్టి అరెస్ట్ చేయించారు. పోలీస్ కస్టడీలో ఉండగానే ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.   తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తుండటంతో,  తీవ్ర భావోద్వేగానికి గురైన బాధితురాలు  సీఎం ఇంటి ముందు సుసైడ్ అటెమ్ట్ చేసింది. ఆ తర్వాత ఈ  కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే  కుల్దీప్‌ సింగ్‌ను అరెస్టు చేసినా కూడా బాధితురాలికి కష్టాలు తప్పలేదు. ఆమె కారులో ప్రయాణిస్తుండగా లారీతో ఢీకొట్టించారు. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు చనిపోగా, బాధితురాలు పక్షాన వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది గాయపడ్డారు.
Tags:    

Similar News