ఇవేం వ్యాఖ్యలు బొత్స.. ఉద్యోగ సంఘాల ఫైర్‌

Update: 2022-11-29 11:30 GMT
ఉద్యోగ సంఘాల నేతలకు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని, ధర్నాలు, రాస్తారోకోలు చేయడం తగదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొద్ది రోజుల క్రితం విజయవాడలో ఉద్యోగ సంఘాల సమావేశంలో మాట్లాడుతూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి లె లిసిందే.

ఉద్యోగ సంఘాల నేతలు అవసరమైతే కాళ్లు పట్టుకోవాలని అనడంపై ఉద్యోగ సంఘాలు ధ్వజమెత్తాయి. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఉద్యోగులు ఉద్యమాలు సాగించి మాత్రమే సౌకర్యాలు, జీతాలు పొందుతున్నారు తప్ప ఏ పాలకుడి కాళ్లు పట్టుకుని పొందలేదన్న విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తించాలని పేర్కొన్నాయి.

మంత్రి బొత్స వ్యాఖ్యలు ఆయన భూస్వామ్య అహంకార మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మండిపడ్డారు. హక్కుల సాధనకే ఉద్యోగ సంఘాలు పెట్టుకునేదన్నారు.

మంత్రి బొత్స తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలకు వెనుకాడబోమని రాష్ట్రోపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి తిమ్మన్న హెచ్చరించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

సమస్యలు సృష్టించి ఉన్న ప్రయోజనాలు తొలగిస్తున్నందుకు ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అశాంతితో ఉన్నారని ఏపీటీ ఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు అన్నారు. సమస్యలు పరిష్కరించకపోగా మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని తెలిపారు.

ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులే కనుక సమస్యలు పరిష్కారానికి వారు కూడా కాళ్లు పట్టుకోవాలని బొత్స సందేశం ఇస్తున్నారా? అని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంజుల, భానుమూర్తి నిలదీశారు.

పీఆర్సీ, ఐదు డీఏలు సక్రమంగా ఇవ్వకున్నా, ఉద్యోగులు దాచుకున్న డబ్బుని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నా ఉద్యోగులు ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. మంత్రి బొత్స ఉద్యోగులను ఇలా తక్కువ చేసిన మాట్లాడటం భావ్యం కాదన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News