సింగ‌పూర్ సంస్థ‌ల‌తో బాబు స్టేజ్ మేనేజ్డ్ డ్రామా

Update: 2018-07-13 10:22 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం - అవినీతి తారాస్థాయికి చేరింద‌ని వైఎస్‌ ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. బాబు సింగ‌పూర్ మంత్రం జ‌పిస్తూ ఇటు రాష్ర్టాన్ని మోసం చేయ‌డ‌మే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని ఆరోపించారు.  హైదరాబాద్‌ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సింగపూర్‌ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రశ్నించారు. సింగపూర్‌ సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలువలేదని టికెట్టు తీసుకుని ఆ సదస్సుకు వెళ్లారని బుగ్గ‌న సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. మున్సిపల్‌ చైర్మన్లు - మేయర్లు వెళ్లాల్సిన మీటింగ్‌ లకు ముఖ్యమంత్రి పోవడం ఏంట‌ని ఆయ‌న విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఇంత‌టితో ఆగిపోకుండా త‌న వెంట మంది మార్భలంతో వెళ్లి ఆంధ్ర‌ప్రదేశ్‌ ను చుల‌క చేశార‌ని మండిప‌డ్డారు. నాలుగేళ్లలో ఆయన ఆరుసార్లు సింగపూర్‌ కు వెళ్లారని విమర్శించారు. ప్రధాని తరువాత ఎక్కువ‌ విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబే అన్నారు.

ఏపీతో సింగపూర్‌ వాళ్లే లబ్ధిపొందుతున్నారని - వారి వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని సింగపూర్‌ కంపెనీలకు దోచి పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని సింగపూర్‌ కంపెనీలకు తాకట్టు పెడుతూ చంద్రబాబు మాటలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. మీటింగ్స్‌లో వ్యవసాయ రుణాలు మాఫీ చేశానని రైతులతో బలవంతంగా పలికిస్తూ..వారికి అనుకూలమైన మీడియాలో మాఫీ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ రుణాలు సగమే మాఫీ చేశారని ఆయన విమర్శించారు. అర్థం కాని రీతిలో మాట్లాడే కళ చంద్రబాబులో చాలా ఉందన్నారు. ఆయన  ఎక్కడికి వెళ్లినా మంత్రి యనమల రామకృష్ణుడిని తోడు తీసుకెళ్తున్నారన్నారు. రామకృష్ణుడు మీకు ధైర్యం ఇచ్చేందుకు వస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఆర్థికశాఖ మంత్రి ప్రతిసారి మీ పక్కన ఎందుకని ఆయన ప్రశ్నించారు

రాష్ట్రం బాగుపడితే అందరూ మద్దతిస్తారని - వీరు చేసే తప్పుడు ప్రచారంతో ఏపీ పరువు పోతోందని బుగ్గ‌న అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిబినెస్‌ అంటే వాణిజ్యం సులభంగా చేయడం అయితే - ఏపీ నంబర్‌ వన్‌ అని ఊదరగొడుతున్నారని బుగ్గ‌న వ్యాఖ్యానించారు. 2016–2017లో ఏపీ నంబర్‌ వన్‌ ర్యాంకు అని ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో వచ్చిందని చెబుతున్నారని అయితే వాస్తవానికి అథ‌మ స్థానంలో ఉందని ఆయన వివరించారు. ఇంతవరకు రాష్ట్రానికి పెట్టుబడి ఎంత వచ్చిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. పెట్టుబ‌డుల పేరుతో హ‌డావుడి చేయ‌డం ప‌ర్య‌ట‌న‌ల పేరుతో నిధులు దుర్వినియోగం చేయ‌డం త‌ప్ప చంద్ర‌బాబు చేసిందేమీ లేద‌ని బుగ్గ‌న స్ప‌ష్టం చేశారు. అమరావతిలో అందరూ ఎలక్ట్రికల్‌ బైక్స్‌ లో తిరుగుతున్నట్లు చంద్రబాబు అక్కడ ప్రచారం చేశారని అస‌లు అలాంటి ప‌రిస్థితి ఏపీలో ఉందా అని బుగ్గ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి కోత‌లు కోయ‌డం బాబుకే సాధ్య‌మ‌న్నారు.
Tags:    

Similar News