హిజాబ్ ఆందోళనలో సెలబ్రిటీ.. పోలీసులు విపరీతంగా కొట్టటంతో మృతి

Update: 2022-10-31 04:30 GMT
మనకు ఉన్నారు సెలబ్రిటీలు. సమాజంలో ఏదైనా దారుణం జరిగినా.. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా.. పల్లెత్తు మాట్లాడటానికి వణికిపోయే సెలబ్రిటీలు.. వీరులు.. శూరులు.. వెండితెర వేల్పులకు ఇప్పుడు చెప్పే వ్యక్తి భిన్నం. మహిళల ఆందోళనకు గొంతుక కావటమే కాదు.. వారు చేస్తున్న న్యాయపోరాటానికి తన ప్రాణాల్ని సైతం ఇచ్చేసిన ప్రముఖుడి వైనం గురించి తెలిస్తే నోట మాట రాకుండా షాక్ తినాల్సిందే.

గడిచిన కొంతకాలంగా ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో తాజాగా ఒక ప్రముఖ చెఫ్ తన ప్రాణాల్ని ఆర్పించారు.  సెలబ్రిటీ అంటే.. షోకులు పోవటం కావటం.. సమాజం కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వటమన్న కొత్త సందేశాన్ని ఇచ్చారు. అతనే ఇరాన్ కు చెందిన ప్రముఖ చెఫ్ మోహర్షాద్ షాహిదీ అలియాస్ జామీ అలివర్.

జామీ అలివర్ కు కేవలం 19 ఏళ్లు మాత్రమే. కానీ.. అతనికి ప్రముఖ చెఫ్ గా గుర్తింపు ఉంది. హిజాబ్ కు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న పోరాటానికి అతను మద్దతు ఇస్తున్నారు. వయసులో చిన్నవాడే అయినప్పటికీ తన దేశంలోని మహిళలు స్వేచ్ఛ కోసం.. తాము కోరుకున్న స్వాతంత్య్రం కోసం.. వారికి దన్నుగా నిలుస్తూ పోరాటానికి దిగారు. దీంతో ఆగ్రహించిన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అతన్ని తీవ్రంగా కొట్టారు. దీంతో.. అతగాడి పుర్రె దెబ్బ తింది. దీంతో అతడు మరణించాడు.

ఆందోళన చేస్తున్న అతడ్ని అరెస్టు చేసి తీవ్రంగా కొట్టటం కారణంగా మరణించినట్లుగా చెబుతున్నారు. తన కొడుకు కమరణానికి కారణంగా అధికారుల తీరేనని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే.. అతను గుండెపోటుతో మరణించాడని చెప్పాల్సిందిగా అధికారులు తమపై ఒత్తిడి తెచ్చినట్లుగా వారు చెబుతున్నారు.

అతగాడి మరణం ఇరాన్ లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అతడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వేలాది మంది ప్రజలు బారులు తీరారు. సెలబ్రిటీకి కొత్త అర్థం తెచ్చేలా మెహర్షద్ షాహిదీ తీరు ఉందంటున్నారు. అతని సోషల్ మీడియా ఖాతాలో 25 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News