హైదరాబాద్ లో దారుణం.. స్నేహితురాలిపై సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి అత్యాచారం

Update: 2022-06-17 04:46 GMT
హైదరాబాద్ నగరంలో వరుస రేప్ లు కలకలం సృష్టిస్తున్నాయి. రొమేనియన్ బాలికపై జూబ్లీహిల్స్‌ లో సామూహిక గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే తాజాగా నగరంలో ఒక యువతిపై జరిగిన మానభంగం కలకలం సృష్టిస్తోంది.

పుట్టిన రోజు పార్టీ అనంతరం ఇంటి వద్ద దింపుతామని చెప్పి అర్ధరాత్రి సమయంలో యువతి ఇంటికి వచ్చిన స్నేహితుల్లో ఒకడు ఆమెపై లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన 28 ఏళ్ల యువతి ప్రగతినగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె కంటెంట్ రైటర్ గా పనిచేస్తోంది. క్రాంతి అలియాస్‌ మ్యాక్స్‌వెల్‌ అనే అతడు జూన్ 13న తన పుట్టినరోజు ఉందంటూ కంటెంట్‌ రైటర్‌ అయిన యువతిని పార్టీకి ఆహ్వానించాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్‌లోని రిపీట్‌ పబ్‌కు స్నేహితులతో కలిసి వెళ్లింది.

పబ్‌లో పార్టీ అనంతరం జూన్ 13 రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తామంటూ క్రాంతితో పాటు స్నేహితులు రోషన్, మనుప్రీత్, కిషోర్‌ ప్రగతి నగర్ లో యువతి ఇంటికి వచ్చారు. అందరూ కలిసి మళ్లీ మద్యం సేవించారు. తెల్లవారుజాము సుమారు 4.30 గంటల వరకు కబుర్లు చెప్పుకున్నారు.

తెల్లవారుజామున 5 గంటల సమయంలో యువతి నిద్రపోయింది. స్నేహితులు కూడా ఆమె ఇంట్లోనే పడుకున్నారు. యువతితో పాటు ఇద్దరు స్నేహితులు ఒక గదిలో, మరో ఇద్దరు ఇంకో గదిలో నిద్రించారు. సుమారు తెల్లవారుజామున 6.15 గంటల సమయంలో రోషన్‌ తనపై అత్యాచార యత్నం చేస్తున్నట్లు గ్రహించిన యువతి అతడిని పక్కకు నెట్టివేసేందుకు ప్రయత్నించింది. అయితే అతడు తనను కొట్టి బలవంతంగా లైంగికదాడి చేసినట్లు యువతి జూన్ 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు అనంతరం లైంగిక దాడికి పాల్పడిన చిత్రపురి కాలనీకి చెందిన రోషన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే వీరంతా సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులని పోలీసులు చెబుతున్నారు. యువతిపై ముందుగా వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే లైంగిక దాడి జరిగిందా? స్నేహితులు అందరూ దీనికి సహకరించారా? తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    

Similar News