కేసీఆర్ స‌ర్కార్‌కు కేంద్రం షాక్.. ఏపీకి రూ.6,756.92 కోట్ల క‌రెంట్ బాకీలు చెల్లించండి

Update: 2022-08-30 04:13 GMT
తెలంగాణ ప్ర‌భుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలను ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విభజన సమస్యలతో ముడిపెడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో పెడుతూ వ‌స్తోంది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ కంపెనీల లావాదేవీల ప్రక్రియ (ఎలక్ట్రిసిటీ యుటిలిటీస్‌ డీమెర్జర్‌ ప్లాన్‌) పూర్తైన తర్వాతే బకాయిల గురించి ఆలోచిస్తామంటూ కాలయాపన చేస్తూ వస్తోంది. అయితే అదేమీ కుద‌ర‌ద‌ని ఏపీ పంపిణీ చేసిన 8,890 మిలియ‌న్ యూనిట్ల‌కు గానూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు బకాయిపడ్డ రూ.6,756.92 కోట్లను నెల రోజుల్లోగా చెల్లించాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ డిస్కమ్‌లకు ఏపీ జెన్‌కో 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకూ తెలంగాణకు అందచేసిన ఈ విద్యుత్‌ సంబంధించిన బకాయిలను తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టివర‌కు చెల్లించలేదు. ఇవి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయాయి.

తెలంగాణ ప్ర‌భుత్వం ఈ బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ విద్యుత్‌ సంస్థలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని కోరింది. సీఎం వైఎస్ జ‌గ‌న్‌తోపాటు మంత్రులు, వైఎస్సార్సీపీ ఎంపీలు సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారి ఈ విష‌యంపై కేంద్రానికి విన‌తులు అందిస్తూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోనూ ప్ర‌ధాని మోదీని ఈ విష‌యంపై విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నేపథ్యంలో రూ.6,756.92 కోట్ల బకాయిలను 30 రోజుల్లోగా చెల్లించాలని తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలను ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉప కార్యదర్శి అనూప్‌ సింగ్‌ బిస్త్ ఆదేశాలు ఇచ్చారు.

వాస్త‌వానికి ఏపీ జెన్‌కో సరఫరా చేసిన 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ డిస్కమ్‌లు రూ.3,441.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో 2022 జూలై 31 నాటికి మరో రూ.3,315.14 కోట్లు లేట్‌ పేమెంట్‌ సర్‌ చార్జీ పడింది. ఈ మొత్తం రూ.6,756.92 కోట్లకు చేరింది. దీంతో ఈ మొత్తాన్ని ఏపీకి చెల్లించాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్ల (ఆర్‌ఈసీ) నుంచి 2014 జూన్‌ 2 నుంచి 2017 మార్చి 31 మధ్య రూ.5,625 కోట్ల రుణాలను ఏపీ జెన్‌కో తీసుకుంది. అలా తీసుకున్న డబ్బులతోనే తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. కానీ వాడుకున్న విద్యుత్‌కు తెలంగాణ డిస్కమ్‌లు డబ్బులివ్వకపోవడంతో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీలకు  చెల్లించాల్సిన బకాయిలను సకాలంలో చెల్లించలేని పరిస్థితి ఏపీజెన్‌కోకు ఏర్పడింది. ఇటీవ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌ల‌కు బ‌కాయిలు చెల్లించని రాష్ట్రాల‌ను బ‌య‌ట విద్యుత్ కొన‌కుండా కేంద్రం నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ జాబితాలో మొద‌ట ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కూడా పేర్కొన్న కేంద్రం ఆ త‌ర్వాత సాంకేతిక త‌ప్పిదం జ‌రిగిందంటూ ఏపీని ఆ జాబితా నుంచి తొల‌గించింది.

2019 ఆగస్టు 19న జరిగిన తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సంయుక్త సమావేశంతో పాటు పలు సందర్భాల్లో ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ డిస్కమ్‌లు ఒప్పుకున్నా రూ.6,756 కోట్ల‌ను మాత్రం ఇవ్వ‌లేదు. 2020 జనవరిలో జరిగిన రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ ఈ పెండింగ్ బ‌కాయిల అంశంపై చ‌ర్చ జ‌రిగింది. గతేడాది నవంబర్‌లో కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్వహించిన రెండు రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శుల సమావేశంలోనూ ఈ మేరకు ఏపీ అధికారులు కేంద్రానికి విన్న‌వించారు. ఆ చర్చలు సఫలం కాకపోగా తమకే ఏపీ తిరిగి బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ కొత్త మెలిక పెట్టింది.

దీంతో తెలంగాణ సర్కారు మొండి వైఖరితో విసిగిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ఈ సమస్యను కేంద్రమే పరిష్కరించాలని కోరింది. ఈ నేప‌థ్యంలో ఏపీకి విద్యుత్ బ‌కాయిలు రూ.6,756 కోట్ల‌ను నెల రోజుల్లోగా చెల్లించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News