వైసీపీ తెచ్చిన నవరత్నాలు..వచ్చే రోజుల్లో నవగ్రహాలే..!

Update: 2019-11-27 11:38 GMT
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు .. తాజాగా మరోసారి సీఎం జగన్ మోహన్ రెడ్డి పై , అయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేస్తున్న నవరత్నాలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం చంద్రబాబు నియోజవర్గాల సమీక్షా సమావేశంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా అయన మాట్లాడుతూ .. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అరాచకాలు ఎక్కువైపోయాయని  - ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దాడులకి దిగుతున్నారని - మంత్రులు నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారని - చివరకు స్పీకర్  కూడా అలానే మాట్లాడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.

అలాగే అయన మాట్లాడుతూ .. వైసిపి అమలు చేయాలనుకుంటున్న నవరత్నాలు భవిష్యత్తులో నవగ్రహాలు గా మారుతాయని -  వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలోనే జగన్ అవినీతికి పాల్పడ్డారని - అటువంటి ఆయన ఇప్పుడు పారదర్శక పాలన అంటున్నారని ఎద్దేవా చేసారు. అలాగే వైసీపీ మంత్రులు - ఎమ్మెల్యేలు అంతా కలిసి అమరావతికి ఉన్న పేరుని తీసేస్తున్నారని అన్నారు. అలాగే వైసీపీ  ఏపీలో పెట్టుబడులు రాకుండా చేసి - ఏపీ విశ్వసనీయతను సైతం దెబ్బతీస్తుందని మండిపడ్డారు. అమరావతిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని - అందుకే రాజధాని అమరావతి ప్రాంతంలో గురువారం పర్యటిస్తున్నానని చెప్పారు.

అలాగే రాష్ట్రంలో వైసీపీ ఎటువంటి పాలన అందిస్తుందో .. రాష్ట్ర యువత ఒకసారి ఆలోచించాలని కోరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అంటే కరెక్ట్ కాదు అని అన్నారు. వైసీపీ నేతలు  పాపం పండే రోజు త్వరలోనే వస్తుందని - రాష్ట్రంలో 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల బాధలు వర్ణనాతీతమని - ఇల్లు కట్టుకుందామనుకునే వారికి ఇసుక దొరకడంలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే  గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ వల్ల ఎంతో మంచి జరిగింది అని తెలిపారు.
Tags:    

Similar News