బాబు విజ‌న్ మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది

Update: 2017-01-07 09:56 GMT
విజ‌న‌రీ నాయ‌కుడిగా తెలుగుదేశం నాయ‌కుడు - ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు పేరుంది. అపుడెపుడో విజ‌న్ 2020 పేరుతో భ‌విష్య‌త్ చిత్రాన్ని ఆయ‌న మ‌న ముందుంచారు. ఇపుడు అలాంటిదే మ‌రొక‌టి కార్యారూపం దాల్చేలాగా చేశారు. అయితే ఇది ప‌రిపాల‌న కోణంలో కాదు. ప‌క్కా రాజ‌కీయ ముందుచూపు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే న‌వ్యాంధ్ర‌ప్రదేశ్‌ లో నిర్మిస్తున్న కొత్త శాసనసభ భవన నిర్మాణంలో చంద్ర‌బాబు ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తోంది. ఎంత ముందు చూపు అంటే.... రాష్ట్రానికి భవిష్యత్తులో కొత్తగా మరిన్ని శాసనసభా స్థానాలు వస్తాయ‌ని - రావ‌ని ఇప్ప‌టికీ చ‌ర్చ‌లు సాగుతున్న‌ప్ప‌టికీ  231 మంది సభ్యులు కూర్చొనేలా శాసనసభ - 90 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా మండలి భవనాలను నిర్మిస్తున్నారు. అంతేకాకుండా వివిధ పార్టీల శాసనసభాపక్ష కార్యాలయాల కోసం మరో ఐదు ఛాంబర్లను నిర్మిస్తున్నారు.

వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయ ప్రారగణంలోనే శాసనసభ నిర్మాణమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాన్ని గడచిన డిసెంబర్‌ లోగానే పూర్తి చేయాలని భావించినప్పటికీ, పనులు ఫిబ్రవరి వరకు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు - 50 మండలి స్థానాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో అదనపు స్థానాల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ కొత్త స్థానాల ఏర్పాటు 2019 నుంచి అమలులోకి వచ్చేలా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండ‌గా, కేంద్రం మాత్రం 2024 నుంచి మాత్రమే అమలు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర, కేంద్రాల మధ్య వివాదం ఉన్నప్పటికీ, 2019నాటికే కొత్తగా శాసనసభా స్థానాలు ఏర్పడగలవని ఆశ పడుతున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్రభుత్వం ఆ మేరకు శాసనసభ నిర్మాణంలో సీటింగ్‌ సదుపాయం ఉండేలా జాగ్రత్త పడుతోంది. మొత్తం 231 సీట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, డిజైనర్లకు అవే ఆదేశాలు జారీచేసింది. 225సీట్లు ఎమ్మెల్యేలకు - మిగిలిన సీట్లు అధికారులకు ఉండేలా చూస్తోంది. కాంట్రాక్ట్‌ నిర్మాణ సంస్థలు కూడా ఇదే సంఖ్యలో సీట్లు ఏర్పాటుచేస్తున్నారు. వీటితో పాటు శాసనసభ అధికారులు - కార్యదర్శి కూర్చొనేందుకు వీలుగా మరో మూడు సీట్లను కూడా అదనంగా ఏర్పాటు చేస్తున్నారు.

ఇక శాసనసభ భవనం దిగువ అంతస్తులో సమావేశ మందిరానికి అదనంగా ముఖ్యమంత్రి - స్పీకర్‌ - ఉప ముఖ్యమంత్రులకు గదులు ఏర్పాటు చేస్తున్నారు. భవనం తొలి అంతస్తులో అధికారులు - వీఐపీలు - సందర్శకులు - మీడియాకు విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్యాలరీలో కనీసం పాతిక నుంచి 30 మంది వరకు కూర్చొనేలా సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే 20 - 60 - 250 మందితో భేటీలు నిర్వహించే స్థాయిలో మూడు సమావేశ మందిరాలనూ తొలి అంతస్తులోనే ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పార్టీల శాసన సభాపక్ష నేతలు - వారి కార్యాలయాలకు ఐదు గదులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు పార్టీలే ఉన్నప్పటికీ - అదనంగా మరో రెండు గదులను ఏర్పాటు చేస్తున్నారు. 2019లో జరిగే ఎన్నికల్లో కొత్త పార్టీలు రంగప్రవేశం చేసే అవకాశాలకు ఈ ఏర్పాట్లు సంకేతంగా నిలుస్తాయని కొందరు విశ్లేషిస్తున్నారు. శాసన మండలి కోసం కూడా ఇదే తరహాలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 50 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ 90 సీట్లు ఏర్పాటు చేస్తుండడం విశేషం. మండలికి కూడా కొత్త స్థానాలు ఏర్పడగలవనే ఆశతోనే ఈ ముందస్తు ఏర్పాట్లని స్పష్టమవుతోంది.

కాగా...ఒకే భవనంలో శాసనసభను - శాసన మండలిని నిర్మిస్తున్నారు. ఈ భవనానికి నాలుగు ప్రధాన గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి - ఉన్నతాధికారులు సచివాలయం నుంచి నేరుగా గేట్‌-1 నుంచి ప్రవేశిస్తారు. మంత్రులు - ఎమ్మెల్యేలు - ఇతర ఉద్యోగులు రెండో గేట్ నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది. స్పీకర్‌ - ముఖ్యమంత్రి - మండలి చైర్మన్‌ లకు మరో ద్వారాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News