సింపతీ కోసం ప్లాన్..ఇంటి విషయంలో బాబు స్కెచ్!

Update: 2019-06-28 15:30 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే గత ప్రభుత్వం తాలూకు అవినీతి వాసనలను సమూలంగా తొలగించాలన్న పట్టుదలతో పని చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే అవినీతి నిర్మూలన జరగాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తొలి ప్రయత్నంగా నదీ తీరాలకు సమీపంలో అనుమతి లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే మొదట ప్రజావేదికను కూల్చివేసి హెచ్చరికలు పంపారు.

 ప్రజావేదిక కూల్చివేత వ్యవహారం ఏపీలో కలకలం రేపింది. గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన ఈ భవనాన్ని కూల్చివేసిన జగన్ ప్రభుత్వం.. అదే తరహా నిర్మాణాల పైనా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటితో పాటు కరకట్టపై ఉన్న కట్టడాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌ డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దీంతో దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది టీడీపీ అధిష్ఠానం.

 ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్ ప్రభుత్వం చేసిన పనికి అనుకూల స్పందన వచ్చింది. దీంతో మిగిలిన కట్టడాలకూ నోటీసులు జారీ చేశారు అధికారులు. అందులో చంద్రబాబు నివాసం కూడా ఉండడం చర్చనీయాంశం అవుతోంది. ఇది అక్రమ కట్టడమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా బహిరంగంగానే ఒప్పుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ విషయంలో వాళ్లంతా యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు నివాసం సక్రమమేనని కొత్త పల్లవి అందుకున్నారు.

 దీనికి కారణం ప్రజల నుంచి సింపతీ కొట్టేయాలనుకోవడమేనన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబును జగన్ ప్రభుత్వం ఇంటి నుంచి ఖాళీ చేయించిందనే అంశాన్ని మాత్రమే లేవనెత్తాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణం కావడంతో చంద్రబాబు ఇంటికీ నోటీసులు జారీ చేస్తారని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ మాజీ ముఖ్యమంత్రి కొత్త ఇంటి కోసం వెతుకుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అలాంటిది ఈ విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు సమాచారం.

 ప్రభుత్వం బురద జల్లేందుకు తన ఇంటి యజమాని లింగమనేని రమేష్‌ తో కోర్టులో పిటీషన్ వేయించబోతున్నారని తెలుస్తోంది. తీర్పు తమకు అనుకూలంగా రాకపోయినప్పటికీ తమ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పుకోవడమే ప్రధాన ఉద్దేశ్యమనే టాక్ వినిపిస్తోంది. అలాగే చంద్రబాబు ఇంటి ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిరసన కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఖాళీ చేయడం తప్పదని తెలిసినా.. సింపతీ కొట్టేయాలన్న ప్రధాన అజెండాతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్నది స్పష్టమవుతోంది.
Tags:    

Similar News