బాబుపై నాన్ బెయిల‌బుల్ వారెంట్..డ్రామాలో పీక్‌

Update: 2018-09-14 10:52 GMT
ప్ర‌చారం కోసం ఆత్రంగా ఎదురుచూసే తెలుగుదేశం పార్టీ నేత‌లకు మ‌రో అవ‌కాశం దొరికింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 14 మందిపై అప్పటి మహారాష్ర్ట ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గోదావరి పై మహరాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010సంవత్సరంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు వెళ్లారు. తెలంగాణా సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కు చేరుకున్న వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయినా బాబ్లీ ప్రాజెక్టు సందర్శించిన తరువాతే వెళ్తామని పట్టుపట్టడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి బెయిల్ తీసుకోవాల్సిందిగా కోరారు. దీనికి చంద్రబాబు నిరాకరించడంతో విమానంలో హైదరాబాద్ కు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అమలులో ఉన్నా పట్టించుకోకపోవడం - వంటి కారణలతో చంద్రబాబు పై కేసు నమోదయ్యాయి. ఇటీవలే చంద్రబాబు కోర్టుకు హజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ఎప్ప‌ట్లాగే దీన్ని టీడీపీ వాడుకుంటోంది.

తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ్యూహాత్మ‌కంగా దీన్ని టీడీపీ తెర‌మీద‌కు తెచ్చింది. ఎత్తిపోతల పధకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టిందని...దాని ఫ‌లిత‌మే ఈ నోటీసుల‌ను పేర్కొంటోంది. చంద్ర‌బాబు తెలంగాణ వ్య‌త‌రేకుల జాబితాలో ఎప్పుడో చేరిపోయార‌ని దాని ఫ‌లితంగానే క‌వ‌ర్ చేసుకునేందుకు ఇలా పాట్లు ప‌డుతున్నార‌ని అంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో కేవలం సానుభూతితోనే గట్టెక్కెయ్యాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆయనకు బాబ్లీ అంశం భలేగా కలిసొచ్చేలా వుంది. ఈ బాబ్లీ ఎఫెక్ట్‌ - తెలంగాణలో టీడీపీకి ఎంతో కొంత మేలు కలిగిస్తుందని టీడీపీ నేతలే చెబుతుండడం గమనార్హం. కాగా, దీనిపై ఇటు న్యాయ నిపుణులు - తెలంగాణ వాదులు చంద్ర‌బాబును ఓ రేంజ్‌ లో వేసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం.

ఈ కేసు గురించి తెలంగాణ‌కు చెందిన ఓ న్యాయ‌నిపుణుడు ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ `` ఈ కేసులో అరెస్టులు ఏమీ ఉండవు. ఇదంతా పెద్ద డ్రామా.. అబిసెంట్ పిటిషన్ వేస్తే ఐపోయేది. కావాలని వేయలేదు. అదే ఓటు కు నోట్ కేస్ లో కోర్ట్ కు రావాలి F.I.R చేర్చాలి అనేసరికి హై కోర్ట్ కు వెళ్లారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రికి నోటీసులు వచ్చినప్పుడు ఆయనకు అప్పీల్ కు వెళ్ళవచ్చు. కానీ  వెళ్ల‌లేదు ఇదంతా ఎన్నికల స్టంట్`` అంటూ తేల్చేశారు. మ‌రోవైపు టీఆర్ ఎస్ సానుభూతి వ‌ర్గాలు దీనిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం మొద‌లుపెట్టాయి. ``మహాకూటమితో జత కట్టిన ఆంధ్రా పార్టీ టీడీపీకి కొంచెం సింపతీ సృష్టిద్దామని బానే స్కెచ్ వేశారు. కానీ ఇదివరకు ఇలాంటి వారెంట్లు మస్తు సార్లు వచ్చినాయి అని, అప్పుడు ఈ వార్త మీడియాకు ఎక్కలేదని మాకు తెలుసు. అంత ఎందుకు, ఈ వారెంట్ వచ్చి కూడా చాలా రోజులు అయ్యింది. జస్ట్ మహాకూటమి ఏర్పాటును సమర్ధించడానికే నిన్న స్ట్రాటజిక్ గా దీన్ని మీడియాకు లీక్ చేశారు`` అంటూ పోస్టులు పెట్టేసి బాబును ఆడుకుంటున్నారు. టీడీపీ నేత‌ల ప్ర‌చార డ్రామా మ‌రోమారు ఇటు ఆన్‌ లైన్లో అటు ఆఫ్‌ లైన్లో కామెడీగా మారింద‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.
Tags:    

Similar News