ధ్వంస సంస్కృతి: సహనం చచ్చిపోతోందే

Update: 2015-03-16 10:46 GMT
విలక్షణ దేశంగా పేరొందిన భారతదేశంలో మత సహనం చచ్చిపోతోంది. మత మౌఢ్యంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణి పెరుగుతోంది. ఒకరు తప్పు చేశారని.. అంతకుమించిన తప్పును మరొకరు చేయటం ద్వారా కొత్త అలజడులను సృష్టిస్తున్నారు.

హర్యానాలో చోటు చేసుకున్న తాజా ఘటనలో చర్చిని నిర్మించిన దానిపై కన్నెర్ర చేసిన వారు.. దాన్ని ధ్వంసం చేసి.. ఆ స్థానంలో హనుమంతుని విగ్రహం ఏర్పాటు చేయటం ఇప్పుడు  కలకలం రేపుతోంది. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్‌ జిల్లాలోని కైమి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చిని స్థానికులు ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గృహ అవసరాల కోసం భవనాన్ని నిర్మిస్తున్నారని.. ఫాస్టర్‌ మాత్రం మత మార్పిడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చర్చి ధ్వంసం వెనుక భజరంగ్‌దళ్‌ హస్తం ఉందని పాస్టర్‌ ఆరోపిస్తున్నారు. చర్చి నిర్మాణం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అయితే.. పాస్టర్‌ మాత్రం మతమార్పిడులను ప్రోత్సహించటంపై మాత్రం స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మతమార్పిడులకు ప్రేరేపిస్తూ పాస్టర్‌ తప్పు చేస్తుంటే.. అతని ఆస్తులను ధ్వంసం చేసిన వారు మరో సమస్యను పెంచారు. దీనికంటే.. పాస్టర్‌ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News