తీసేకముందే గౌరవంగా వైదొలిగారు..

Update: 2018-12-22 05:54 GMT
కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ-మురళి దంపతులు గడిచిన ఎన్నికల్లో  ఓటమి పాలయ్యారు. సురేఖ పరకాలలో ఘోరంగా ఓడిపోయింది. టీఆర్ ఎస్ అఖండ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ నుంచి టికెట్ కోసం కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై టీఆర్ ఎస్ శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఇప్పటికే సదురు ఫిరాయింపు ఎమ్మెల్సీలకు నోటీసులు పంపారు. టీఆర్ఎస్ పార్టీ ఎలాగూ వేటు వేయడం తథ్యం కావడంతో కొండా మురళి తనే గౌరవంగా ఎమ్మెల్సీ పదవికి ఈరోజు ఉదయం రాజీనామా సమర్పించారు.

రాజీనామా చేసిన అనంతరం కొండా మురళి-సురేఖ మాట్లాడారు. టీఆర్ ఎస్ దాయదాక్షిణ్యాలపైన ఆధారపడి తాము లేమని.. అందుకే వారు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు మురళి ప్రకటించారు.

కాగా టీఆర్ఎస్ ఎలాగూ సస్పెన్షన్ విధించకముందే కొండా మురళి ప్రీ ప్లాన్ డ్ గా రాజీనామా సమర్పించారు.  అధికార పార్టీ సస్పెండ్ చేస్తే చులకన అయిపోతామని.. అందుకే ఆత్మగౌరవం కోసం వీళ్లే రాజీనామా చేయడం విశేషం.

కొండా సురేఖ-మురళి దంపతులు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడు నియోజకవర్గాలపై తమ పట్టును నిలుపుకునేవారు. కానీ ఈ ఎన్నికలతో వారి పట్టు - పరువు కూడా పోయింది. భూపాలపల్లిలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ స్పీకర్ మధుసూదనాచారి సొంత పొరపాట్లే కాంగ్రెస్ అభ్యర్థి గండ్రను గెలిపించాయి. ఇక పరకాలలో సురేఖ, వరంగల్ తూర్పులో కూడా కాంగ్రెస్ అభ్యర్తి ఓడిపోయారు. దీంతో సురేఖ-మురళి ప్రాబల్యం ప్రస్తుతానికి వరంగల్ లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా చేజారడంతో పరిస్థితి ఎటూ కాకుండా పోయింది.
    

Tags:    

Similar News