బ్రెజిల్‌లో కరోనా మృత్యుఘోష..ఒకే రోజే 3,251 మంది..!

Update: 2021-03-24 10:11 GMT
బ్రెజిల్‌ లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తుంది. ఆ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మంగళవారం ఒకే రోజు 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో వైపు రోజువారి కరోనా కేసులు 84వేలకుపైగా నమోదైనట్లు బ్రెజిల్ ప్రభుత్వం తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం.. మొత్తం మరణాల సంఖ్య 3లక్షలకు చేరుకోగా ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. లాక్‌ డౌన్‌ విధించకపోవడం వల్లే కేసులు పెరిగినట్లు ఆ దేశ ప్రతిపక్షాల ఆరోపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. కరోనా కట్టడిలో వైఫల్యం కావడంతో ఆరోగ్యశాఖ మంత్రిని ఆ దేశ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో తొలగించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ మార్సెలో క్యూరోగాను ఆరోగ్య మంత్రిగా నియమించారు. ఆర్మీ జనరల్ ఎడ్వర్డో పజుఎల్లోకు ఎలాంటి వైద్య అనుభవం లేని వ్యక్తిని ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఆస్పత్రులన్నీ పేషెంట్లతో నిండిపోగా... ఇదే పరిస్థితి కొనసాగితే అక్కడి హెల్త్ కేర్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో వల్లే దేశంలో ఇంత దారుణ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో తొలి నుంచి కరోనా కట్టడిలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజల ప్రాణాల కంటే ఆర్థిక కార్యకలాపాలే ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వందలాది మంది బ్రెజిలియన్ ఆర్థికవేత్తలు,మాజీ ఆర్థికమంత్రులు,సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు జైర్ బోల్సోనారోకి బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా విషయంలో జైర్ బోల్సోనారో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే వ్యాక్సిన్ అందరికీ తప్పనిసరి అని సుప్రీం కోర్టు చెప్తే, తాను మాత్రం వ్యాక్సిన్ వేయించుకోనని అన్నారు. అంతేకాదు,వ్యాక్సిన్‌పై జనాల్లో లేనిపోని గందరగోళం సృష్టించారు.


Tags:    

Similar News