చాట్‌ ఆధారం చాటే ఆర్య‌న్ సేఫ్‌.. కోర్టు సంచ‌ల‌న కామెంట్లు

Update: 2021-11-20 14:40 GMT
కేసు ద‌ర్యాప్తు చేయ‌డం కాదు.. స‌ద‌రు కేసును ప‌క్కాగా నిరూపించే ఆధారాలు సేక‌రించ‌డంలోనే.. అధికారుల తెలివిడి క‌నిపిస్తుంది. ఏదో సంచ‌ల‌నం సృష్టించేశాం.. ఇక‌, మీడియాలో బ్రేకింగులు వ‌స్తాయి.. అనే ఫ‌క్తు రాజ‌కీయ స్ట‌యిల్‌.. ద‌ర్యాప్తులు ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి. పేరొందిన ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లే.. ఇలా.. వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో.. ఇప్పుడు.. అస‌లు కేసు ద‌ర్యాప్తుల‌పైనే పెద్ద అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. తాము చేప‌ట్టిన కేసుల్లో చూపించే ఆధారాల్లో ప‌స లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణంగా క‌నిపిస్తోంది. తాజాగా దేశాన్ని ఒక్క‌కుదుపు కుదిపేసిన‌.. బాలీవుడ్ బాద్‌షా.. షారుఖ్ ఖాన్ కుమారుడు.. ఆర్య‌న్ వ్య‌వ‌హారం.. గాలిలో తేలిపోయిన‌ట్టు అయింది.

వాస్త‌వానికి డ్ర‌గ్స్ కేసులో ఆర్య‌న్‌ను అరెస్టు చేయ‌డం నుంచి బెయిల్ వ‌చ్చే వ‌ర‌కు.. విప‌రీత‌మైన టెన్ష‌న్ వాతావ‌ర‌ణం క‌నిపించింది. బ్రేకింగులు.. బిగ్ బ్రేకింగులు.. సంచ‌ల‌నాలు.. విశ్లేష‌ణ‌ల పేరుతో .. విమ‌ర్శ‌లు.. ఒక రకంగా చెప్పాలంటే.. మీడియా మోత మోగిపోయింది. భాష‌ల‌కు అతీతంగా.. దేశ‌వ్యాప్తంగా వార్తామాధ్య‌మాలు మార్మోగాయి. అయితే.. ఇంత‌కీ .. ఈ కేసు ఏమైంది? అంటే.. గాలి బుడ‌గా పుటుక్కున్న పేలిపోయే ద‌శ‌కు చేరింది. అంతేకాదు.. ఇప్పుడు.. డ్ర‌గ్స్ కేసులు ప‌రిశోధిస్తున్న ఎన్సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో)పైనే వేళ్లు చూపించే ప‌రిస్థితి వ‌చ్చింది.

తాజాగా.. ఎన్సీబీ న‌మోదు చేసిన కేసులో ఆర్య‌న్ కు పెద్ద ఉప‌శ‌మ‌నం ల‌భించింది. ఈ కేసులో ఆధారాలు స‌మ‌ర్పించ‌డంలో ఎన్సీబీ పూర్తిగా విఫ‌ల‌మైంది. ఆర్య‌న్ ఖాన్ రెగ్యుల‌ర్ గా డ్ర‌గ్స్ వాడాడు అని ఎన్సీబీ త‌న అభియోగాల్లో ప్ర‌ధానంగా పేర్కొంది. అందుకు ఆధారం అత‌డి వాట్సాప్‌ చాట్ లిస్టే అని లీకులు ఇచ్చింది. ఆ త‌ర్వాత కోర్టుకు ఆ చాట్ లిస్టును స‌మ‌ర్పించింది. దీంతో ఈ కేసులో మ‌రింత ఉత్సుక‌త పెరిగిపోయింది. ఇక‌, అంశంపై స్పందించిన ముంబై కోర్టు.. ఆర్య‌న్ చాట్ లిస్టులో అభ్యంత‌క‌ర‌మైన‌వి ఏమీ లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఆ చాట్ ప్ర‌కారం... అత‌డిపై డ్ర‌గ్స్ విష‌యంలో కుట్ర చేశాడ‌నే అభియోగాల‌ను మోప‌డానికి వీల్లేద‌ని కోర్టు ప్ర‌క‌టించింది. ఏ వాట్సాప్ చాట్ అయితే ఈ వ్య‌వ‌హారంలో సంచ‌ల‌నంగా నిలుస్తుంద‌న్నారో, ఆ వాట్సాప్ చాట్ లోనే విష‌యం ఏమీ లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

అలాగే ఆర్య‌న్ ఖాన్ స్నేహితుల వ‌ద్ద పట్టుబ‌డిన డ్ర‌గ్స్ మోతాదు చాలా ప‌రిమితం. ఆరు గ్రాముల డ్ర‌గ్స్ మాత్ర‌మే దొరికిన‌ట్టుగా ఎన్సీబీ స్వ‌యంగా పేర్కొంది. డ్ర‌గ్స్ కేసుల్లో మోతాదుల‌ను బ‌ట్టే.. కేసులు, శిక్ష‌లు ఉంటాయి. ఈ విష‌యాన్ని ఆర్య‌న్ న్యాయ‌వాదులు ప్ర‌స్తావించారు. కోర్టు కూడా స్పందించింది. వారి వ‌ద్ద లభించిన డ్ర‌గ్స్ ప‌రిమాణం చిన్న‌ద‌ని పేర్కొంది. ఈ కేసులో న‌ల‌భై మంది... కోర్టును ఆశ్ర‌యించారు. వారి విష‌యంలో కోర్టు నుంచి ఎలాంటి సానుకూల‌తా రాలేదు. వాట్సాప్ చాట్ ఆధారంగా హీరోయిన్ అన‌న్యా పాండేను కూడా ఎన్సీబీ విచార‌ణ‌కు పిలిచిన సంగ‌తి తెలిసిందే. కానీ.. ఆమె విష‌యంలో కూడా ఆ త‌ర్వాత ఎన్సీబీ ఎలాంటి అడుగూ ముందుకు వేయ‌లేదు. ఇప్పుడు ఆర్య‌న్ ఖాన్ స‌న్నిహితుల‌కు కూడా కోర్టు వ్యాఖ్య‌లు ఉప‌శ‌మ‌నాన్ని ఇస్తున్నాయి. మొత్తంగా స‌రైన ఆధారాలు స‌మ‌ర్పించ‌డంలో ఎన్సీబీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News