భారత్‌ జోడో యాత్రకు కోర్టు షాక్‌!

Update: 2022-11-08 05:30 GMT
వచ్చే ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలో తేవడానికి ఆ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పూర్తయింది. మహారాష్ట్రలోకి ప్రవేశించింది.

రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు కోర్టు భారత్‌ జోడో యాత్రకు షాకిచ్చింది. భారత్‌ జోడో యాత్ర ట్విట్టర్‌ ఖాతాను బ్లాక్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

భారత్‌ జోడో యాత్ర పేరిట ట్విట్టర్‌లో ఒక అధికారిక ఖాతాను కాంగ్రెస్‌ పార్టీ తెరిచింది. అయితే ఇందులో పొందుపరుస్తున్న వీడియోలు కాపీ రైట్‌ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దీంతో బెంగళూరు కోర్టు భారత్‌ జోడో యాత్ర ట్విట్టర్‌ హ్యాండిల్‌ను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

కాగా బెంగళూరు కోర్టు ఉత్తర్వులను కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టులో సవాలు చేయాలని నిర్ణయించింది. భారత్‌ జోడో యాత్ర వీడియోల కోసం తమ సంగీతాన్ని, సినిమా పాటలను వాడుకున్నారని ఎంఆర్‌టీ మ్యూజిక్‌ సంస్థ అభియోగాలు మోపింది. ఇది కాపీరైట్‌ ఉల్లంఘనకు కిందకు వస్తాయని కోర్టు దృష్టికి తెచ్చాయి. తన పాటల్లో కాంగ్రెస్‌ స్వల్ప మార్పులు మాత్రమే చేసిందని.. తమ పాటలను యథేచ్చగా వాడుకున్నారని పిటిషనర్‌ కోర్టులో ఫిర్యాదు చేశారు. కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేకాకుండా కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ రాహుల్‌ గాంధీ, జైరామ్‌ రమేష్, సుప్రియా శ్రీనెట్‌లపై యశ్వంత్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లతో ఎంఆర్‌టీ సంస్థ కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ.. భారత్‌ జోడో యాత్ర వీడియోలకు వాడిన మ్యూజిక్‌.. ఎంఆర్‌టీ మ్యూజిక్‌ సంస్థకు చెందినదని నిర్ధారించిన కోర్టు కాపీరైట్‌ ఉల్లంఘనకు కాంగ్రెస్‌ పార్టీ పాల్పడ్డట్టు గుర్తించింది. అంతేకాకుండా ఆ వీడియోలను సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ, భారత్‌ జోడో యాత్రల ట్విట్టర్‌ ఖాతాలను కూడా బ్లాక్‌ చేయాలని సూచించింది.

కాగా తమ సోషల్‌ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించినట్టు మీడియా ద్వారానే తెలుసుకున్నామని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. కోర్టు ఆర్డర్‌ కాపీ తమకు అందలేదని చెప్పింది. అందిన తర్వాత తాము కోర్టులో పిటిషన్‌ వేసి తమ వాదనలు వినిపిస్తామని పేర్కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News