కొవిడ్ వైరస్ 'వర్క్ ఫ్రం హోం'.. అందుకే చైనాలో కేసులు

Update: 2022-05-02 09:30 GMT
కొవిడ్ ఎక్కడ పుట్టింది.. చైనాలో వెలుగుచూసిందని మనం తొలినాళ్ల్లలో అనుకున్నాం. వూహాన్ లోని ల్యాబ్ నుంచి అని.. లేదు.. అక్కడి మాంసాహార మార్కెట్ నుంచి అని రకరకాల వాదనలు వచ్చాయి. గబ్బిలాల నుంచి వ్యాపించిందనే వాదన కూడా సాగింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే.. ఏకంగా "చైనా వైరస్" అనే పిలిచేవారు. దీనిపై చైనా మరింత గట్టిగా స్పందించేది. తమ దేశ పేరును వాడుతున్నారెందుకంటూ మండిపడేది. కరోనా అమెరికాలోనే పుట్టిందంటూ ప్రత్యారోపణలకు దిగేది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా రెండేళ్ల కాలంలో 62 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 10 లక్షల మంది, భారత్ లో 5 లక్షల మంది చనిపోయారు.

ఇదంతా వరల్డో మీటర్ గణాంకాల ప్రకారమే. అనధికారికంగా ఇంతకు ఎన్నో రెట్లు ప్రజలు చనిపోయినట్లు అంచనా. కానీ, ఇప్పటికీ కొవిడ్ వైరస్ ఎక్కడ పుట్టిందో తేలడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏమీ తేల్చలేకపోయింది. తొలినాళ్లలో చైనాను వెనకేసుకొచ్చిన డబ్ల్యూహెచ్ వో తర్వాత కొంత తగ్గింది. అయితే చాలామంది నమ్మేది మాత్రం కొవిడ్ వైరస్ చైనాలో పుట్టిందనే. అక్కడి ప్రజల ఆహార అలవాట్లు, గత చరిత్ర రీత్యా ఇదే నిజమని అనుకుంటుంటారు.

పుట్టింట్లో ఆడబిడ్డ?2019 అక్టోబరులోనే చైనాలో కొవిడ్ బయటపడిందని.. కానీ, తమ ఉక్కు క్రమశిక్షణతో చైనా దానిని బయటకు రానీయలేదని ఓ వాదన ఉంది. అంతేకాదు.. 2019 నవంబరులో వైరస్ కేసు బయటపడ్డాక కూడా వూహాన్ లో లాక్ డౌన్ విధించింది. ఆ దేశంలో మరెక్కడా లాక్ డౌన్ మాట వినిపించలేదు. 2020 ఏప్రిల్ లో ఓవైపు ప్రపంచమంతా లాక్ డౌన్ అయితే.. చైనా రాజధాని బీజింగ్ లో కనీసం ఆ మాట లేదు. చైనాలో పుట్టిన వూహాన్ స్ట్రెయిన్, భారత్ లో పుట్టిన డెల్టా వేరియంట్ల కారణంగా రెండు వేవ్ లు వచ్చాయి. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమైక్రాన్ కారణంగా థర్డ్ వేవ్ వచ్చింది. ఒమైక్రాన్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కానీ, వ్యాప్తిలో వేగవంతమైనప్పటికీ.. ప్రమాదరీత్యా ఈ వేరియంట్ తో ఇబ్బంది లేకపోవడంతో ముప్పు తప్పింది. అయితే, మిగతా ప్రపంచం ఒమైక్రాన్ నుంచి బయటపడినా చైనా మాత్రం సతమతం అవుతోంది.

మూడు నెలలుగా స్వైర విహారం చైనాది మొదటినుంచి "జీరో కొవిడ్" పాలసీ. అంటే కనీసం ఒక్క కేసు కూడా ఉండడానికి వీల్లేదనేది వారి ఉద్దేశం. కానీ, అలాంటిచోట తాజాగా మూడు నెలల నుంచి మహమ్మారి కోరలు చాస్తోంది. 2019 తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో ఉద్ధృతి చూపిస్తోంది. దాంతో పలు నగరాలు కఠిన ఆంక్షల చట్రంలో బందీగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘైలో కరోనా విజృంభిస్తోంది. ప్రస్తుతం షాంఘైలో కేసులు తగ్గుముఖం పడుతోన్న సమయంలో బీజింగ్‌లో కేసులు పెరుగుతున్నాయి. దాంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు రెస్టారెంట్లలో భోజనం చేయొద్దంటూ నిషేధం విధించింది. కరోనా వైరస్ వెలుగుచూసిన ఇళ్లు, భవనాలను సీల్‌ చేస్తోంది.

పర్యాటకులకు కొవిడ్ నెగెటివ్ ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేసింది. షాంఘై తరహా పరిస్థితుల్ని నివారించేందుకు ఈ ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. షాంఘై నగరంలో లాక్‌డౌన్ కారణంగా అక్కడి ప్రజలు ఆకలితో అల్లాడిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆంక్షలతో విసిగిపోయిన ప్రజల నిరసన స్వరాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఇక ప్రస్తుతం ఈ నగరంలో పాజిటివ్‌ల సంఖ్య దిగొస్తోంది. వరుసగా రెండో రోజు 10 వేలకు దిగువన కేసులు నమోదయ్యాయి.

వర్క్ ఫ్రం హోం అంట.. అందుకే..అసలు ఇప్పుడు అక్కడ ఎందుకు వైరస్‌ విజృంభిస్తుందనే ప్రశ్నకు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా చమత్కారంగా సమాధానం ఇచ్చారు. 'ఈ రోజుల్లో చైనాలో కరోనా తీవ్రతకు కారణం ఏంటని నేను హర్షానంద స్వామిని అడిగాను. 'వైరస్‌ అలసిపోయింది. అందుకే వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాలనుకుంటోంది' అని ఆయన సమాధానమిచ్చారు' అంటూ హర్ష సరదాగా ట్వీట్ చేశారు. మహమ్మారిని మొదట చైనాలోని వుహాన్‌ నగరంలో గుర్తించిన విషయాన్ని ఉద్దేశిస్తూ, అలాగే కరోనా కారణంగా సంస్థల్లో మారిన పనితీరును ప్రస్తావిస్తూ ఆయన ఈ విధంగా స్పందించారు.
Tags:    

Similar News