విజయసాయి చెప్పిన కూర్మన్నపాలెం డీల్ వింటే.. 'అత్తారింటికి దారేది' సీన్ గుర్తుకు రావాల్సిందే

Update: 2022-10-12 04:47 GMT
పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలు.. అధికారపార్టీకి ఇబ్బందికరంగా మారిన దసపల్లాభూముల ఎపిసోడ్ వేళ.. ఆయా అంశాలపై ప్రెస్ మీట్ పెట్టి.. వివరణ ఇచ్చేందుకు ఉద్దేశించిన మీడియా సమావేశం.. వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయికి ఇబ్బందికరంగా మార్చాయని చెప్పాలి.

స్వభావ రీత్యా తాను టార్గెట్ చేసే వారి మీద మాటలతో అగ్రెసివ్ గా దూసుకెళ్లే ఆయన తీరుకు భిన్నంగా ఆయన మాటలు ఉండటం.. మాట్లాడిన కొన్నిమాటలు సైతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సొంత పార్టీలోని పలువురికి ఒళ్లు మండేలా చేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. అన్నింటికి మించి.. ఆయన నోటి నుంచి వచ్చిన కుర్మన్న పాలెం డీల్ గురించి విన్నంతనే అత్తారింటికి దారేది? సినిమాలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ రాజ్ నోటి నుంచి వచ్చిన.. 'ఇంత డీసెంట్ డీల్ నేనెప్పుడూ చూడలేదు' అన్న డైలాగ్ చప్పున గుర్తుకు రాక మానదు.

ఆ మూవీలో నదియాకు చెందిన హోటల్ ను తమకు కారుచౌకగా రాసిచ్చేయాల్సిందిగా ఒత్తిడి తేవటం.. అందులో భాగంగా సెటిల్ మెంట్ కోసం ఆమెను కూర్చెబెట్టటం.. ఆమె తీసుకున్న కూసింత అప్పునకు మొత్తం హోటల్ రాసివ్వాలని.. లేదంటే.. తప్పుడు పనులు జరుగుతున్నాయంటూ రైడ్లు.. కేసులు తప్పవని చెప్పటం.. ఆ సందర్భంలో సెటిల్ మెంట్ చేసే రాజకీయ నాయకుడిగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ పాత్రధారి.. 'ఇంత డీసెంట్ డీల్ నేనెప్పుడూ చూడలేదన్న' మాట చెప్పటం తెలిసిందే. తాజాగా విజయసాయి నోటి నుంచి వచ్చిన డీల్ గురించి తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.

దసపల్లా భూములకు సంబంధించి.. దాని యజమానులకు సంబంధించి వచ్చిన విమర్శలు.. ఆరోపణలపై విజయసాయి ఇచ్చిన వివరణ వరకు ఓకే అనుకుంటే.. అనూహ్యంగా ఆయన తీసుకొచ్చిన కూర్మన్నపాలెం భూముల డీల్ వైనం చూస్తే.. వైజాగ్ లో ఇలా కూడా జరుగుతుందా? అన్న భావన కలుగక మానదు. విశాఖపట్నంలోని కూర్మన్న పాలెం భూమి యజమానికి ఒక శాతం ఇచ్చి.. ప్రాజెక్టు డెవలపర్ 99 శాతం తీసుకున్నారని.. ప్రపంచంలో మరెక్కడా లేనిది ఇక్కడే చూస్తున్నట్లు చెప్పారు.

దసపల్లా భూముల వ్యవహారంలో భూ యజమానులుగా చెప్పుకునే వారు.. తమ భూముల్ని డెవలప్ మెంట్ కు ఇచ్చి.. 29 శాతం భూ యజమానులు.. 71 శాతం డెవలపర్ తీసుకునేలా ఒప్పందం తీసుకోవటం పెను సంచలనంగా మారి హాట్ టాపిక్ అయ్యింది. ఇదే ఇలా ఉంటే.. దీనికి మించి అన్నట్లుగా కూర్మన్నపాలెం డీల్ గురించి విజయసాయి చెప్పిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. విజయసాయి నోటి నుంచి వచ్చిన కూర్మన్నపాలెం ప్రాజెక్టు స్థానిక వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యానారాయణదే కావటం. ఇప్పటికే పెను విమర్శలకు తావిచ్చిన హయగ్రీవ ప్రాజెక్టులోనూ ఆయనే భాగస్వామి. కూర్మన్నపాలెం ప్రాజెక్టు ప్రస్తావనను అనూహ్యంగా తెచ్చిన విజయసాయి మాటలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. విజయసాయి మాటలు.. పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు.. అధిపత్య పోరుకు నిదర్శనమన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. విశాఖలో జరిగే డీల్స్ ఏ స్థాయిలో ఉంటాయనటానికి నిదర్శనంగా విజయసాయి నోటి నుంచి వచ్చిన కూర్మన్న పాలెం ఎపిసోడ్ నిలుస్తుందని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News