శ్రద్ధా వాకర్.. ఆ రాక్షసుడి వలలో ఎలా పడింది?

Update: 2022-11-17 04:02 GMT
శ్రద్ధ వాకర్. మూడు.. నాలుగు రోజుల క్రితం కూడా ఆ పేరు చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు. కానీ.. మూడు రోజుల వ్యవధిలోనే దేశం మొత్తం ఇప్పుడా పేరును తలుచుకోని వారు.. అయ్యో అనుకోకుండా ఉన్న వారు లేరు. ఆమె చేసిన తప్పు.. పిచ్చిగా ప్రేమించటం.. గుడ్డిగా నమ్మేయటం. ప్రేమ కోసం ఆమె తపించిన వైనం.. తాను ప్రేమించినోడితో కలిసి ఉండేందుకు ఆమె పడిన తపన చూసినప్పుడు.. అలాంటి ఆ అమ్మాయి ఒక కిరాతకుడి చేతిలో పడటం.. దారుణంగా ప్రాణాలు కోల్పోయిన వైనం అందరిని నిర్ఘాంతపోయేలా చేస్తుంది. ఆమెను చంపిన విధానం.. ఆ తర్వాత జరిగింది తెలిసిన వారి ఒళ్లు జలదరించే పరిస్థితి.

ఇంతకీ శ్రద్ధా వాకర్ తల్లిదండ్రులు ఎవరు? ఆమె ఎలాంటి పరిస్థితుల్లో కిరాతకుడైన ఆప్తాబ్ అమీన్ పూనావాలా మాయలో పడింది? అన్నది చూస్తే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ కు చెందిన వికాస్ వాకర్.. సుమన్ దంపతులకు పుట్టిన గారాల పట్టి శ్రద్ధావాకర్. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. తండ్రి ఎలక్ట్రానిక్స్ సర్వీస్ షాపు. తల్లి ఇంట్లోనే ఉంటుంది. జాబ్ కోసం 2018లో ముంబయికి వచ్చింది శ్రద్ధ. ఒక బహుళ జాతి సంస్థలోని కాల్ సెంటర్ లో ఆమెకు జాబ్ వచ్చింది. అదే కాల్ సెంటర్ లో అఫ్తాబ్ అమీన్ పూనావాలా పని చేసేవాడు.

 ఒకేచోట పని చేస్తున్న వారు.. ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. 2019 నుంచి ఇద్దరు సహజీవనం చేయసాగారు. మలాద్ లోని ఒక ఇంట్లో ఇద్దరు ఉండేవారు. కొన్ని నెలల తర్వాత  తన రిలేషన్ గురించి తల్లితో షేర్ చేసింది. దీంతో తండ్రికి తెలిసింది. కూతురు నిర్ణయాన్ని ఆమె పేరెంట్స్ వ్యతిరేకించారు. అయినా.. తాను ప్రేమించినోడే ఎక్కువని చెప్పేసింది. ఆఫ్తాబ్ ను వదిలేయాలని ఎంత కోరినా.. పిచ్చి ప్రేమలో ఉన్న శ్రద్ధకు అవేమీ పట్టలేదు.

తాను ప్రేమించిన వ్యక్తితోనే ఉంటానని.. అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె.. తల్లిదండ్రులతో గొడవ పడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. తన వస్తువుల్ని ఇంట్లో నుంచి తెచ్చేసుకుంటూ.. తాను ఇకపై చచ్చిన శవాన్ని అంటూ వాళ్లతో తనకున్న బంధాన్ని తెంచేసుకుంది. అదే ఆమె పాలిట చావుగా మారుతుందని ఆ క్షణంలో ఆమెకు తెలీదు. కూతురు తీరుతో వేదన చెందిన ఆమె తల్లిదండ్రులు శ్రద్ధాకు దూరంగా ఉండసాగారు. తాము మరింత ప్రయత్నిస్తే ఎక్కడ ఆఘాయిత్యం చేసుకుంటుందో అని దూరంగా ఉండేవారు. కాకుంటే.. ఆమె స్నేహితుల ద్వారా ఆమెకు సంబంధించిన వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు.

ఇదిలా ఉంటే 2020లో శ్రద్ధ తల్లి మరణించారు. దీంతో తల్లిని చూసేందుకు ఇంటికి వచ్చిన ఆమె అంత్యక్రియలు పూర్తి కాకుండానే ఆప్తాబ్ వద్దకు వెళ్లిపోయింది. అయితే.. తల్లి బతికి ఉన్నప్పుడు.. ఆప్తాబ్ తనను కొట్టేవాడన్న విషయాన్ని తల్లితో షేర్ చేసుకున్నది. ఈ విషయానికి వేదన చెందిన తల్లి.. భర్తతో చెప్పి బాధ పడి.. ఏమైనా చేయాలని కోరింది. అయితే.. తనను కొట్టినా.. ఆ తర్వాత తనకు సారీ చెబుతాడంటూ పిచ్చి ప్రేమను చూపించే తప్పించి.. అతగాడి తీరును సరిగా అంచనా వేయలేకపోయింది.

తల్లి మరణం తర్వాత అయినా శ్రద్ధలో మార్పు వస్తుందని ఆశించినా అలాంటిదేమీ కనిపించలేదు. ఆఫ్తాబ్ తీరు గురించి ప్రస్తావించిన ఆమె తండ్రి.. అతడ్ని విడిచి పెట్టి రావాలని చెప్పినా అందుకు అంగీకరించలేదు. దీంతో మనసు విరిగిన తండ్రి ఆమెకు దూరంగా ఉంటూ.. అప్పుడప్పుడు కుమార్తె స్నేహితుల ద్వారా యోగక్షేమాల్ని తెలుసుకుంటూ ఉండేవాడు. లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం ఆఫ్తాబ్ ఇంట్లోనూ తెలిసింది. వారు సైతం వ్యతిరేకించారు. దీంతో.. వారు ముంబయిని విడిచి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి వచ్చిన తొలి రోజున ఒక హోటల్లో బస చేసి.. తర్వాతి రోజు మరో హోటల్ లో ఉన్నారు. తర్వాతి స్నేహితుడి ఇంట్లో ఉన్నారు. తర్వాత ఛత్తర్ పూర్ లో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడే ఉండసాగారు.

అప్పటికే ఆప్తాబ్ జాబ్ సంపాదించగా.. శ్రద్ధ జాబ్ వెతుకులాటలో ఉంది. ఆమె సోదరుడు ఈ ఏడాది సెప్టెంబరులో కాల్ చేయగా.. ఫోన్ స్విఛాప్ లో ఉంది. దీంతో.. ఆమె స్నేహితుల్ని కాంటాక్టు చేయగా.. తమకు అలాంటి పరిస్థితే ఎదురైందని చెప్పటంతో.. ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన మనసు కీడు శంకించి పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టారు. అప్పటికే పలువురు స్నేహితుల నుంచి ఆరా తీసిన సమాచారంతో.. ఆయనకు ఏదో సందేహం కలిగి పోలీసుల్ని ఆశ్రయించారు.

ఆమె ఢిల్లీలో ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు.. అక్కడి మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. ముందుగా ఆఫ్తాబ్ ఫోన్ ను ట్రాక్ చేశారు. మే 19 నుంచి అతడు ఢిల్లీలోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఫోన్ ద్వారా అతడి లొకేషన్ ను ట్రేస్ చేశారు. అతడి ఇంటి వద్దకు వెళ్లి విచారణ మొదలుపెట్టారు. తనతో గొడవ అయ్యిందని.. ఆమె తన నుంచి వెళ్లిపోయిందని.. ఇప్పుడు ఎక్కడ ఉందన్న విషయం తెలీదంటూ కట్టుకథ అల్లాడు. ఇంట్లో ఎప్పటివరకు ఉందన్న విషయాన్ని అడిగినప్పుడు అతడు చెప్పిన తేదీ అతడ్ని పట్టించేలా చేసింది.

ఆఫ్తాబ్ చెప్పిన సమాచారంతో ఆమె ఫోన్ నెంబరు లొకేషన్ ట్రేస్ చేశారు పోలీసులు. ఇంట్లో గొడవ జరిగి వెళ్లిపోయినట్లు చెప్పిన దాని తర్వాత కూడా ఆమె ఫోన్ సిగ్నల్.. ఆప్తాబ్ ఇంట్లోనేఉన్నట్లుగా తెలిసిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటిలానే బుకాయింపు కబుర్లు మొదలుపెట్టాడు. ప్రశ్న.. ప్రశ్నకు పొంతనలేని సమాధానాలు చెప్పటంతో.. తమదైన శైలిలో విచారణ షురూ చేశాడు. అప్పడు నోరు విప్పిన ఆప్తాబ్.. తాను చేసిన దారుణకాండ గురించి చెప్పటంతో పోలీసులు సైతం షాక్ తిన్నారు.

మే 18న శ్రద్ధ.. ఆఫ్తాబ్ మధ్య గొడవ జరిగింది. పెళ్లి విషయంపై శ్రద్ధ పట్టుపట్టింది. ఇంకెన్నాళ్లు ఈ సహజీవనం అని ప్రశ్నించిన ఆమె.. పెళ్లికి బలవంతం చేసింది. గొడవ పెరిగి పెద్దదైంది. శ్రద్ధ గొంతును గట్టిగా నులిమాడు. ఆమె ఊపిరి ఆగే వరకు ఆ గొంతును అలానే నొక్కి పట్టాడు. ప్రాణం పోయిన తర్వాత శవాన్ని ఎలా మాయం చేయాలన్న ఆలోచన చేశాడు. ఇందులో భాగంగా తర్వాతి రోజున మార్కెట్ కు వెళ్లి పెద్ద ఫ్రిజ్ కొన్నాడు. శ్రద్ధ శవాన్ని బాత్రూంలో ముక్కలు ముక్కలుగా నరికాడు. తనతో తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లలో ఆమె బాడీ పార్ట్స్ ను పెట్టేశాడు. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పటికీ  మే లో ఎండలు ఎక్కువ కావటంతో ఫ్రిడ్జి నుంచి వాసన రావటం మొదలైంది. దీంతో.. రూమ్ ప్రెషనర్స్.. స్ప్రే చేసేవాడు.

శవాన్ని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జిల్ పెట్టిన దానిలోనే మంచినీళ్లు.. పాలు ఉంచేవాడు. రోజుకు కొన్ని అవయువాల్ని ముక్కలుగా చేసి.. వాటిని తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి పడేసి వచ్చేవాడు. బయట ఫుడ్ ఆర్డర్ ఇచ్చేవాడు. అలా 18 రోజుల పాటు శవాన్ని మాయం చేసేందుకు పని చేశాడు. జూన్ 5 వరకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శ్రద్ధ బాడీ పార్ట్స్ ను పడేసిన అతడు.. ఇరుగుపొరుగుతోనూ మాట్లాడేవాడు కాదు. అతని ఇంటికి మాత్రం అమ్మాయిలు వచ్చి వెళ్లేవారు.

తాను చేసిన పనిని పోలీసులు గుర్తించలేరన్న పిచ్చి నమ్మకం అతడిలో ఎక్కువని.. అందుకే ఫ్రిడ్జిను అతను తనతోనే ఉంచుకున్నాడని చెబుతున్నారు. శవాన్ని మాయం చేసేందుకు అమెరికన్ క్రైమ్ సిరీస్ డెక్స్ టర్ స్ఫూర్తిగా చేసుకున్నాడు. ఆమె బాడీ పార్ట్స్ ను సేకరించేందుకుపోలీసులు ప్రయత్నిస్తున్నారు. చాలా కాలం కావటంతో గుర్తించటం కష్టంగా మారింది. ఇదిలా ఉంటే.. బాడీ పార్ట్స్ ను కట్ చేసిన కత్తి పోలీసులకు ఇంకా దొరకలేదు.

ఇదిలా ఉంటే.. తన కుమార్తెకు ఏమీ కాలేదని.. ఆమె తండ్రి భోరుమంటున్నారు.ఫోరెన్సిక్ నివేదిక వస్తే తప్పించి నమ్మనంటూ విలపిస్తున్నాడు. ఈ మొత్తం ఉదంతాన్ని విన్న తర్వాత.. పిల్లల ప్రేమ.. వారి ఎంపికకు సంబంధించిన తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండటంతో పాటు.. వారి టీనేజ్ లోనే ఆకర్షణకు.. ప్రేమకు మధ్య తేడా తెలిసేలా చేయాలంటున్నారు. ఏమైనా తాను పిచ్చిగా ప్రేమించి.. ఆరాధించిన వాడి చేతిలో అత్యంత దారుణంగా.. క్రూరంగా ప్రాణాలు కోల్పోయింది. పిచ్చిగా ప్రేమించటం తప్పేం కాదు.. కానీ దానికి అర్హత ఉన్న వ్యక్తా? కాదా? అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News