టీడీపీ ఎంపీకి ఆయనే సరైనోడా.. ?

Update: 2022-01-03 16:30 GMT
తెలుగుదేశం పార్టీకి ఓటమెరుగని ప్లేస్ ఏంటి అంటే శ్రీకాకుళం  ఎంపీదే అని చెప్పుకోవాలి. పార్టీ పెట్టాక గత నాలుగు  దశాబ్దాలలో ఇక్కడ ఏడేళ్ళు మాత్రమే  టీడీపీ గెలుపునకు దూరంగా ఉంది.  1984 నుంచి ఇప్పటిదాకా పదిసార్లు ఎంపీ ఎన్నికలు జరిగితే వాటిలో చూసుకుంటే  మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అంటే ఏడు సార్లు టీడీపీ జెండా ఎగరేసిన సీటు ఇది అని గర్వంగా చెప్పుకోవాల్సిందే. వైసీపీ అయితే ఇప్పటికి ఒక్కసారి కూడా బోణీ కొట్టని సీటు ఇది.

ఇక గతంలో కాంగ్రెస్ తరఫున బొడ్డేపల్లి రాజగోపాలనాయుడు ఏకంగా ఇరవయ్యేళ్ళ పాటు ఎంపీగా ఉంటే ఆయన తరువాత ఎర్రన్నాయుడే పదమూడేళ్ళ పాటు ఎంపీగా కొనసాగారు. ఆ తరువాత రికార్డు ఆయన తనయుడు రామ్మోహననాయుడిదే. ఆయన 2024 వరకూ ఎంపీగా ఉంటారు కాబట్టి పదేళ్ల పాటు పవర్ లో ఉన్నట్లే. మరో సారి పోటీ చేసినా సరైన ప్రత్యర్ధి లేకపోవడం వల్ల ఆయనే గెలుస్తారు అంటున్నారు. అంటే ఈసారి కనుక రామ్మోహన్ గెలిస్తే తండ్రి ఎర్రన్నాయుడి రికార్డుని బద్ధలు కొడతారు అన్న మాట. మరి ఆయనకు ఆ చాన్స్ ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకూడదని వైసీపీ గట్టిగా డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

అయితే వైసీపీ అనుకుంటున్నంత సులువు మాత్రం ఇక్కడ గెలుపు కాదు, ముందు ఆ పార్టీకి సరైన క్యాండిడేట్ లేరు అన్నదే పార్టీలో మాట. 2014లో ఇక్కడ నుంచి రామ్మోహన్ మీద రెడ్డి శాంతిని పోటీకి పెడితే ఓడిపోయారు. 2019లో దువ్వాడ శ్రీనుకు టికెట్ ఇస్తే ఆయన కూడా ఓడిపోయారు. రెడ్డి శాంతి 2019 ఎన్నికల్లో పాతపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చేసారి కూడా ఆమె ఎమ్మెల్యేగానే ఉండాలనుకుంటున్నారు. దువ్వాడ శ్రీనుకు జగన్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయన టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు మీద పోటీకి దిగుతారు అని అంటున్నారు.

మరి శ్రీకాకుళం ఎంపీ సీటుకు వైసీపీకి ఉన్న అభ్యర్ధులు ఎవరూ అంటే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు ఒకటి వినిపిస్తోంది. అయితే ఆమె తాను ఎంపీగా పోటీ చేయనని అంటున్నారు. ఇస్తే టెక్కలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేకపోతే రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతున్నారు. మరి ఆమె కాకపోతే ఎటు చూసినా ఒకే ఒక పేరు వినిపిస్తోంది.ఆ పేరే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

ఆయన సీనియర్ మోస్ట్ నేత. అనేకసార్లు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఆయన్ని జూనియర్ ఎర్రన్నాయుడుకి పోటీగా బరిలోకి దింపాలని జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని టాక్ నడుస్తోంది. ధర్మాన అయితేనే రామ్మోహన్ నాయుడుని ఓడించగలరని నమ్ముతోంది. మరి దానికి ప్రసాదరావు ఒప్పుకుంటారా అంటే ఇక్కడే వైసీపీ కొత్త వ్యూహాలతో ముందుకు వస్తోంది. ప్రసాదరావు తనయుడు రామ మనోహర్ నాయుడుకి శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా ప్రసాదరావుని ప్రసన్నం చేసుకుని ఎంపీగా పోటీ చేయించాలనుకుంటోందిట.

ఆయన కనుక పోటీ చేస్తే అనుభవం, రాజకీయ వ్యూహాలు అన్నీ కలసి కచ్చితంగా ఈసారి రామ్మోహన్ ఓడిపోతారని వైసీపీ అంచనా వేస్తోందిట. రామ్మోహన్, ధర్మాన ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు, అంతే కాదు, అంగ బలం, అర్ధబలం సరిసమానంగా తూగుతాయి. మరి ఇదే ప్లాన్ కనుక వర్కౌట్ అయితే మాత్రం గెలుపు ఎవరికి అని చెప్పలేకపొయినా  శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ మహా రంజుగా ఉంటుంది అనడంలో సందేహం లేదనే చెప్పాలి.
Tags:    

Similar News