బీజేపీ లెక్క తప్పిందా?

Update: 2022-07-04 06:02 GMT
ఇపుడిదే విషయమై పార్టీలో చర్చ మొదలైంది. మూడురోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ మూడు రోజులూ నరేంద్రమోడి హైదరాబాద్ లోనే ఉన్నారు. పార్టీ ప్రెస్టీజియస్ సమావేశాలు కాబట్టి మోడీ సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన కొందరు కీలక నేతలు పార్టీలో చేరుతారనే ప్రచారం విపరీతంగా జరిగింది.

తమ పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలపైన ఎక్కువగా గురిపెట్టింది. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నది. ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలు తప్పవనే ప్రచారం అందరికీ తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే పై రెండు పార్టీల్లోని నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ నేతలు కూడా చాలా గట్టి ప్రయత్నాలే చేశారు. మోడీ సమక్షంలో పార్టీలో చేరేందుకు చాలామంది నేతలు ఆసక్తిగా ఉన్నారని ఊదరగొట్టారు.

తీరా చూస్తే పార్టీలో  చేరింది మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రమే. కాంగ్రెస్ కు చెందిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి లాంటి వాళ్ళ పేర్లు విస్తృతంగా ప్రచారమైంది. అలాగే టీఆర్ఎస్ లోని కొందరు ఎంఎల్ఏలు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు బీజేపీలో చేరటం ఖాయమని ప్రచారం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు రావన్న అనుమానం ఉన్న అధికార పార్టీ నేతల్లో చాలామంది కమలం పార్టీ కండువా కప్పుకోవటం ఖాయమన్నారు.

అయితే జరిగిన ప్రచారం వేరు జరిగిన వాస్తవం వేరు. పై రెండు పార్టీల నుండి సమారు 100 మంది నేతలతో బీజేపీ నేతలు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లిస్తామని వీరిలో చాలామందికి హామీ ఇచ్చారట.

ఎందుకంటే బీజేపీ తరపున పోటీ చేయటానికి చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే లేరు. అందుకనే పోటీ చేయబోయే గట్టి అభ్యర్ధుల కోసం బీజేపీ గాలమేస్తోంది. తీరాచూస్తే మూడు రోజుల సమావేశాల్లో జరిగింది వేరు. ఇక్కడే బీజేపీ లెక్క తప్పినట్లు ప్రచారం మొదలైపోయింది. ఇంతకీ కమలం పార్టీ లెక్క ఎక్కడ తప్పింది ?
Tags:    

Similar News