ఆ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ ర‌ఘురామ‌కు ఊర‌ట ల‌భించిన‌ట్టేనా?

Update: 2022-08-23 05:01 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసి కొట్టార‌నే ఆరోప‌ణ‌ల‌పై వైఎస్సార్సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు, ఆయ‌న కుమారుడు, ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బందిపై న‌మోదైన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎంపీ ర‌ఘురామ‌కు ఊర‌ట క‌ల్పించింది. త‌దుప‌రి ఉత్త‌ర్వులు ఇచ్చే వ‌ర‌కు ఆయ‌న‌పై ఎలాంటి బ‌ల‌వంత‌పు చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

త‌మ‌పై హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి పోలీసులు పెట్టిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాల‌ని కోరుతూ ఎంపీ ర‌ఘురామ‌రాజు మొద‌ట తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. అయితే తెలంగాణ హైకోర్టు ఆయ‌న పిటిష‌న్‌ను తోసిపుచ్చ‌డంతో ర‌ఘురామ దీన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ కేసును న్యాయ‌మూర్తులు జస్టిస్ ఎస్‌. అబ్దుల్ నజీర్, జస్టిస్ జె.కె.మహేశ్వరితో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసులో తాము తదుపరి ఉత్తర్వుల ఇచ్చే వరకు ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు, ఆయ‌న కుమారుడు భ‌ర‌త్, భ‌ద్ర‌తా సిబ్బందిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌ద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్య‌వ‌హారంలో తెలంగాణ పోలీసుల‌కు నోటీసులు జారీ చేసింది.

కాగా జూలై 5 హైద‌రాబాద్‌లోని త‌న ఇంటి స‌మీపంలో అనుమానాస్ప‌దంగా త‌చ్చ‌ట్లాడుతున్న వ్య‌క్తిని ర‌ఘురామ భ‌ద్ర‌తా సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నించి వ‌దిలేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ త‌ర్వాత అత‌డు తాను ఏపీ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్‌న‌ని ఎంపీ ర‌ఘురామ‌తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు, ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది త‌న‌ను చిత‌క‌బాదార‌ని గ‌చ్చిబౌలి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడి చేసినందుకు ఎంపీతోపాటు ఆయన కుమారుడు భరత్‌, పీఏ శాస్త్రి, ర‌ఘురామ‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తున్న‌ సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్ఐ, కానిస్టేబుల్‌పై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు.

మరోవైపు ఈ వ్య‌వ‌హారంలో కానిస్టేబుల్‌ ఫరూక్‌పై దాడికి దిగిన సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేశారు. కాగా రఘురామ ఇంటివద్ద ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఫరూక్‌ ఎందుకు అనుమానంగా త‌చ్చ‌ట్లాడుతున్నాడ‌నే విష‌యంపై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసులు భిన్నమైన వాదనలు వినిపించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటి వద్ద నిఘాలో భాగంగా కానిస్టేబుల్‌ ఫరూక్‌ విధులు నిర్వర్తిస్తున్నారని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ తెల‌ప‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు ఏపీ పోలీసులేమో ఫరూక్‌ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

కాగా ప్రధాని మోడీ అల్లూరి సీతారామ‌రాజు కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు భీమ‌వ‌రం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ పర్యటన సంద‌ర్బ‌రంగా ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఆయన అనుచరులపై నిఘా ఉంచాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫరూక్‌ గచ్చి బౌలి బౌల్డర్‌హిల్స్‌ కాలనీ ప్రధాన ద్వారంవద్ద విధులు నిర్వర్తిస్తున్నారని గ‌చ్చిబౌలి ఇన్‌స్పెక్ట‌ర్ వెల్ల‌డించారు.
Tags:    

Similar News