రెండూ ఒక్కటిగా : టీడీపీ జనసేనలను కలిపే ఎన్నికలు...?

Update: 2022-07-20 02:30 GMT
పొత్తుల విషయంలో ఎటూ తేలక కిందా మీదా అవుతున్న ఆ రెండు పార్టీలకు రిహాల్సల్స్ కి రంగం సిద్ధం అవుతోందా అంటే జవాబు అవును అనే వస్తుంది మరి. ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు రెండూ పొత్తుల విషయంలో ఈ రోజు దాకా పెద్దగా మాట్లాడడంలేదు. మహానాడు తరువాత టీడీపీ టోన్ మారిందని జనసేన అనుమానిస్తోంది. ఇక జనాలు మా వైపే ఉన్నారని చాటి చెప్పడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో సార్వత్రిక ఎన్నికల కంటే ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీలో రాబోతున్నాయి. ఏపీలో పట్టభద్రుల ఎన్నికలతో పాటు ఒక ఉపాధ్యాయ స్థానానికి కూడా వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తారు.

ఈ మేరకు చూస్తే ఆరు నెలలకు పైగా వ్యవధి ఉన్నప్పటికీ అన్ని పార్టీలు సర్దుకుంటున్నాయి. నిజానికి ప్రధాన రాజకీయ పార్టీలలో వామపక్షాలు, బీజేపీ తప్ప మిగిలిన వారు పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు పెద్దగా లేవు. ఎందుకంటే ఆ ఎన్నికలు వాటి ఓటర్లు, ఆ లెక్కలు అన్నీ కూడా బీజేపీ కమ్యూనిస్టులకే బాగా తెలుసు. ఇక అసలు ఎన్నికల విషయంలోనే ఎపుడూ టీడీపీ కానీ వైసీపీ కానీ దృష్టి పెడుతూంటాయి.

వీలైన చోట్ల తమకు అనుకున్న వాళ్ళకు మద్దతు ఇస్తూంటాయి. అంటే ఇండైరెక్ట్ గానే ఈ ఎన్నికల విషయంలో ఉంటున్నాయి తప్ప తొడకొట్టి బరిలోకి దిగిన సందర్భం లేదు. అయితే ఫస్ట్ టైమ్ అధికార వైసీపీ మరీ ముందుగానే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి తమ అభ్యర్ధులను మూడు చోట్ల ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తించింది. ఉత్తరాంధ్రా పట్టభద్రుల నియోజకవర్గానికి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ ని ఎంపిక చేశారు.

అలాగే కడప, కర్నూలు, అనంతపురం నుంచి గోపాలరెడ్డి కొడుకు వెన్నపూస రవీంద్రారెడ్డి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు నుండి వేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డిని ఎంపిక చేశారు. ఇక ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధిని కూడా ఖరారు చేస్తారని తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ రంగంలో నిలిచినట్లు అయింది. అందునా అధికార పార్టీ బరిలో ఉంటే విపక్షంలో ఉండే టీడీపీ జనసేన ఊరుకుంటాయా అన్నదే చర్చగా ఉంది. పైగా తొమ్మిది జిల్లాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నికలు ఇవి.

ఉత్తరాంధ్రా అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు  ఉంటాయి. అలాగే కడప, కర్నూల్, అనంతపురం మరో నియోజకవర్గంగా ఎన్నిక జరుగుతుంది. ఇక చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు ల నుంచి మరో సీటుకు ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అన్నీ కూడా పట్టణ ప్రాంతంలోనే ఉన్న ఓటర్లు అలాగే పట్టభద్రులైన ఓటర్లు ఈ ఎన్నికల్లో పాలుపంచుకుంటారు. అంటే అర్బన్ ఓటర్ల మనోగతం ఏంటి అన్నది సర్కార్ కి ఈ సందర్భంగా తెలుస్తుంది.

దాంతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఏడాది ముందు ఏ స్థాయిలో ఉంది తెలుసుకునేందుకు ఇది ఒక సంకేతంగా ఉంటుంది. దాంతో ఈ ఎన్నికలు కీలకంగానే ఉంటాయని అంటున్నారు ఇక వైసీపీ ఓటర్లు మద్దతుదారుల గురించి చూస్తే ఎక్కువగా రూరల్ బేస్డ్ గానే ఉంటారని అంటారు. అర్బన్ సెక్టార్ లో చదువరులలో వైసీపీ మీద వ్యతిరేకత ఉందని కూడా అంటారు.

దాంతో ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకోవడానికైనా టీడీపీ జనసేన తప్పకుండా బరిలోకి దిగుతాయని అంటున్నారు. ఇక రెండు పార్టీలు విడిగా పోటీ చేయకుండా కలసి పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగితే వైసీపీకి ఇబ్బంది కలుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. 2023 మార్చి నెలలో అంటే సరిగ్గా అసలైన ఎన్నికకలు ఏడాది ముందు వైసీపీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిస్తే కనుక ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరి దాని కోసం, తమ ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం జనసేన టీడీపీ పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగుతాయా అంటే చూడాల్సి ఉంది మరి.
Tags:    

Similar News