‘హిందూ మీల్స్’పై వెనక్కి తగ్గిన ఎమిరేట్స్

Update: 2018-07-05 08:52 GMT
దుబాయ్ కేంద్రంగా నడిచే విమానయాన సంస్థ ఎమిరేట్స్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. మతం ప్రాతిపాదికన మీల్స్ ఉండవంటూ  ‘హిందూ మీల్స్ ’ను  తమ విమానాల్లో వడ్డించమని  ఎమిరేట్స్ యాజమాన్యం మెనూ నుంచి తీసేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఇప్పుడు తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. భారతీయుల మత విశ్వాసాలకు అనుగుణంగా ఇక నుంచి హిందూ మీల్స్ ను కొసాగిస్తున్నామని ప్రకటన జారీ చేసింది.

ఎమిరేట్స్ విమానాల్లో హిందూ మీల్స్ ఉపసంహరణ నిర్ణయంపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారతీయుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా హిందూ మీల్ ఆప్షన్ ను కొనసాగిస్తున్నట్టు ఎమిరేట్స్ తాజాగా ధ్రువీకరించింది. ఎమిరేట్స్ అన్ని రకాల ప్రత్యేక భోజనాలను కస్టమర్లకు ఆఫర్ చేస్తుందని.. వారిలో హిందూ కస్టమర్లు కూడా ఉంటారని.. వారికి ఇక నుంచి నిరంతరం సేవలు అందిస్తామని పేర్కొంది. వారి అభిరుచికి తగినట్లుగా వ్యవహరిస్తామని తెలిపింది.

అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని వారికి సౌకర్యంగా ఉండే వంటకాలను సిద్ధం చేస్తుంటాయి. వాటికి మతాల పేర్లు కూడా పెట్టి తొందరగా గుర్తించేలా రూపొందిస్తాయి. ఎమిరేట్స్ ఆ పద్ధతిని తొలగించాలని చూసి అభాసుపాలైంది.
Tags:    

Similar News