మాజీ మంత్రి నారాయ‌ణ‌కు షాక్‌.. బెయిల్ ర‌ద్దు

Update: 2022-10-31 10:34 GMT
టీడీపీ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. ప‌దోత‌ర‌గ‌తి పరీక్ష పత్రాల లీక్ కేసులో  నారాయణ బెయిల్ రద్దు చేసింది. అంతేకాదు, నవంబరు 30వ తేదీలోపు పోలీసులకు లొంగిపోవాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అయితే న్యాయస్థానం అయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఏం జ‌రిగిందంటే..

ఈ ఏడాది ఏప్రిల్‌ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్‌ ద్వారా బయటకు వచ్చింది. ఇది తీవ్ర దుమారం రేపింది. దీంతో రంగంలోకి దిగిన చిత్తూరు జిల్లా పోలీసులు కేసులో నారాయణ విద్యాసంస్థ‌ల అధినేత నారాయ‌ణ‌ పాత్ర ఉన్నట్టు తేల్చారు. ఆయన్ను హైద‌రాబాద్‌లో అరెస్టు చేశారు. ప్రశ్నపత్రం వాట్సప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ స్టేషన్‌లో కేసు నమోదైంది.  ఇందులో నారాయణ కళాశాలల డీన్‌ బాలగంగాధర్‌ తో సహా ఏడుగురి పైన కేసులు నమోదు చేశారు.

ప్ర‌శ్న పత్రాలను బయటకు పంపటం..తిరిగి సమాధానాలు ఏ రకంగా పరీక్షా హాల్ లోకి పంపేది అదుపులోకి తీసుకున్న వారు చెప్పార‌ని పోలీసులు అప్ప‌ట్లో తెలిపారు. ఇది ముందస్తు ప్రణాళికతో కొనసాగుతున్న నేరంగా వివరించారు. ప్రతీ సారి ఇదే విధంగా చేస్తున్నారని..పూర్తి ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేసామని వెల్లడించారు. హైదరాబాద్‌ నుంచి తరలించేటప్పుడు నారాయణ ఉన్న వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకుంటాయని.. ఆయన ఆచూకీ తెలియకుండా ఉండటానికి పలుమార్లు వాహనాలను మార్చి రాత్రికి చిత్తూరుకు తరలించామ‌ని పోలీసులు వివ‌రించారు.

అనంతరం చిత్తూరు తీసుకొచ్చి..వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ తరువాత నారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ వద్ద 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు.  నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. దీంతో..పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో నారాయ‌ణ‌కు బెయిల్ వ‌చ్చింది. అయితే, తాజాగా దీనిని ర‌ద్దు చేస్తూ లోక‌ల్ కోర్టు తీర్పువెలువ‌రించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News