అనంత అమ్మాయిలు కడప వెళ్లి ఆత్మహత్య

Update: 2022-02-02 05:41 GMT
వారిద్దరూ స్నేహితులు.అది కూడా అలాంటి ఇలాంటి స్నేహితులు కాదు.. ప్రాణ స్నేహితులు. బతుకును ఇవ్వాల్సిన స్నేహం ఏమైందో కానీ.. కలిసి చనిపోయేలా చేసింది. వీరిద్దరి ఆత్మహత్యతో వెలుగు చూసిన షాకింగ్ నిజం ఏమంటే.. వీరిద్దరూ ప్రాణ స్నేహితులన్న విషయం ఇరు కుటుంబాల వారికి తెలియకపోవటమే. ఈ అనంతపురం జిల్లా అమ్మాయిలు.. కడప జిల్లాలోని రైల్వేట్రాక్ మీద ప్రాణాలు తీసుకున్న వైనం కలిచివేస్తోంది.పందొమ్మిదేళ్ల చిరుప్రాయంలో ఏం కష్టం వచ్చిందో కానీ.. ఇలా ప్రాణాలు తీసుకున్న తీరు ఇరుకుటుంబాల వారు గుండె పగిలేలా శోకిస్తున్నారు.

ఇద్దరి ఇళ్లల్లోఎలాంటి సమస్యలు లేకపోవటం.. చదువుల్లో రాణిస్తున్న ఇద్దరికి ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు. మరేం కష్టం వచ్చిందో కానీ.. తమ జిల్లాను విడిచి పెట్టి పక్కనే ఉన్న కడప జిల్లాకు వచ్చి మరీ ఆత్మహత్య చేసుకోవటం ఏమిటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.తమ మరణానికి ముందు.. కడప బస్టాండ్ లో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకోవటం.. అది వారి మొబైల్ లో వారి ఆఖరి గుర్తుగా నిలిచింది. రెండు జిల్లాల్లోనూ షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉండే పందొమ్మిదేళ్ల కల్యాణి.. సొంతూరు యాడికి మండలం కమలపాడు సచివాలయంలో పని ఉందని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. మరోవైపు తాడిపత్రికి చెందిన 19 ఏళ్ల పూజిత కాలేజీకి వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. సోమవారం ఉదయం తాడిపత్రి బస్టాండ్ లో 9.42 గంటలకు కర్ణాటక బస్సు ఎక్కారు. కడపలో దిగారు. ఆ తర్వాత కడప బస్టాండ్ లోనే వీరిద్దరు నవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగారు. ఆ తర్వాత కడప రైల్వే స్టేషన్ కు వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు అక్కడే ఉన్నట్లుగా అక్కడి సీసీ ఫుటేజ్ లను చూసినంతనే తెలుస్తోంది.

తర్వాత రాజంపేట వైపు పట్టాల మీద నడుచుకుంటూ వెళుతున్న వారిని.. పట్టాల మీద పని చేసే సిబ్బంది.. మీరు ఇలా పట్టాల మీదకు రాకూడదని చెప్పటంతో వారు అక్కడ నుంచి బయటకు వచ్చి.. రోడ్డు మీద ఆటోలో ఎర్రముక్కపల్లె రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. పట్టాలపై నడుచుకుంటూ వస్తున్న వేళ.. గూడ్స్ రైలు డ్రైవర్ చేసి రైలు వేగానని తగ్గించి.. వారిని హెచ్చరించటంతో వారు పట్టాలు దిగారు. ఆ తర్వాత వచ్చిన గూడ్స్ రైలు దగ్గరకు రాగానే ఇద్దరూ ఒక్కసారిగా పట్టాల మీద పడటాన్ని ప్రత్యక్ష సాక్ష్యులు చూసినట్లు చెబుతున్నారు.

కల్యాణి ఘటనా స్థలంలోనే మరణించగా.. పూజిత మాత్రం అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. వీరిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? కారణం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వీరిద్దరి ఫోన్ కాల్ డేటా.. వాట్సాప్ ల లో వివరాల్ని సేకరిస్తున్నారు. అలా అయినా.. వీరిద్దరి ఆత్మహత్యకు కారణం ఏమైనా దొరుకుందేమోనని భావిస్తున్నారు. అనూహ్యంగా ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య చేసుకోవటాన్ని వారి తల్లిదండ్రులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి శోకం చూపరుల్ని సైతం కదిలించేసింది.
Tags:    

Similar News