ముందస్తు ఎన్నికలపై క్లారిటి ఇచ్చినట్లేనా ?

Update: 2022-08-25 06:39 GMT
ప్రకాశం జిల్లా రైతులకు మేలు చేసేలా వెలిగొండ ప్రాజెక్టును 2023 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత ఎన్నికలకు వెళతామని స్పష్టంగా చెప్పారు. అంటే జగన్ మాట ప్రకారం ప్రాజెక్టు సెప్టెంబర్ 2023 నాటికి పూర్తి అవ్వాలి. కానీ అప్పటికి ప్రాజెక్టు పూర్తవుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ప్రభుత్వం దగ్గరున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే నిధులు లేకపోవటమే.

నిధులు లేనపుడు రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు. అలాంటపుడు ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళతామన్నారు. అంటే అంతర్లీనంగా అర్ధమవుతున్నదేమంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని జగన్ స్పష్టంగా చెప్పేసినట్లేనా ? రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పెద్ద ఎత్తున  ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నుండి ముందస్తుపై ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయని పదే పదే చెబుతున్నారు.

జగన్ తాజా ప్రకటన తర్వాత ముందస్తు ఎన్నికలు రావని చెప్పకనే చెప్పినట్లయ్యింది. ఇక ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో ఎవరు చెప్పలేరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటుంది. అదేమిటంటే అంచెలంచెలుగా మద్యనిషేధం విధించిన తర్వాత మాత్రమే ఎన్నికల్లో ఓట్లడుగుతామని ప్రతిపక్షంలో ఉన్నపుడు స్పష్టంగా జనాలకు హామీఇఛ్చారు.

2014 ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి తెచ్చేస్తామని చెప్పారు. మరిపుడు మద్య నిషేధం దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందా ?

నిజానికి మధ్య నిషేధం అన్న హామీనే ఒక పనికిమాలిన హామీ. మద్యనిషేధం సాధ్యం కాదని గతంలోనే చాలాసార్లు నిరూపణైంది. ఏపీ చుట్టుపక్కలున్న తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేది, గోవా రాష్ట్రాల్లో మద్యంపై నిషేధంలేనపుడు ఏపీలో మాత్రమే నిషేధం ఎలా సాధ్యమని జగన్ అనుకున్నారో అర్ధంకావటం లేదు.

మద్యనిషేధం సాధ్యం కాదని జగన్ కు తెలుసు అలాగే జనాలకూ బాగా తెలుసు. మద్యనిషేధం, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకపోతే అప్పుడు జగన్ ఏమిచేస్తారో చూడాలి.
Tags:    

Similar News