గమనించారా? ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు జంపింగ్ లే..

Update: 2022-10-27 07:46 GMT
తెలంగాణ రాజకీయాలను ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఊపేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ముంగిట ప్రత్యర్థి పార్టీలను బలహీన పర్చడానికి ఇప్పటివరకు చేరికల ఎత్తులు పై
ఎత్తులు సాగగా.. తాజాగా ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కేంద్రంలోని పెద్దలు రూ.100 కోట్ల చొప్పున ఎర వేసినట్లుగా ఆరోపణలు వస్తుండడం పరిస్థితులను మరింతగా వేడెక్కిస్తోంది. ఈ
అంశం జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ చర్చ రేపే అవకాశం ఉంటుంది. దీనిని తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో బలంగా ప్రస్తావించొచ్చు.

గతంలో పార్టీ మారినవారే కాగా, బీజేపీ రూ.వంద కోట్ల ఎర వేసిందంటున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్ (నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్), పైలట్ రోహిత్ రెడ్డి (వికారాబాద్ జిల్లా తాండూరు), రేగా కాంతారావు (పినపాక)లకు బీజేపీ వల వేసిందని, వీరికి డబ్బుతో కాంట్రాక్టులూ ఇవ్వజూపిందని కథనాలు వస్తున్నాయి. పోలీసుల వెర్షన్ కూడా
దీనికి దగ్గరగానే ఉంది. అయితే, ఈ ముగ్గురిలో ముగ్గురు దాదాపు ఒకే ప్రాంతానికి చెందినవారు కాగా.. ఒక్కరు మాత్రం వీరికి దూరంగా ఉన్న నియోజకవర్గానికి చెందినవారు. చిత్రమేమంటే
వీరిలో ముగ్గురు సహజంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు. అంటే వేరే పార్టీపై గెలిచి ఆనక టీఆర్ఎస్ లో చేరినవారు.

గువ్వల ఒక్కరే టీఆర్ఎస్ నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలంగాణ రాకముందు నుంచీ టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. వైఎస్ జీవించి ఉన్న కాలంలో కాంగ్రెస్ తరఫున పోటీకి ఉత్సాహం చూపిన ఆయన.. 2009లో మాత్రం మహా కూటమి తరఫున నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ టిక్కెట్ పైనే గెలుపొందారు.

ఈ ముగ్గురూ కాంగ్రెస్ వారే కదా? పైలట్ రోహిత్ రెడ్డి.. తాండూరులో బలమైన పట్నం మహేందర్ రెడ్డిని ఓడించి మరీ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆనక టీఆర్ఎస్ లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక పట్నం మహేందర్ రెడ్డిని నియోజకవర్గంలో అడుగడుగునా సవాల్ చేస్తూ వస్తున్నారు. వీరిద్దరి పంచాయితీ పలుసార్లు టీఆర్ఎస్ అధిష్ఠానం వద్దకూ వెళ్లింది.

వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ అని రోహిత్ కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక హర్షవర్ధన్ రెడ్డి కూడా కొల్లాపూర్ లో టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి, పలుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన జూపల్లి క్రిష్ణారావును ఓడించి కాంగ్రెస్  తరఫున నెగ్గారు. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా వెలమల ఆధిపత్యం సాగుతుండగా.. దానిని ఛేదించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కానీ, ఆ వెంటనే టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. ఈ నియోజకవర్గంలోనూ హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి వర్గాలు తీవ్రంగా ఆధిపత్య పోరాటం సాగిస్తున్నాయి. ఓ దశలో జూపల్లి టీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం కూడా సాగింది. ఇక మరో ఎమ్మెల్యే రేగా కాంతారావు కూడా కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్ లోకి జంప్ కొట్టారు. ప్రస్తుతం విప్ గా కొనసాగుతున్నారు. చిత్రమేమంటే.. వీరు ముగ్గురూ 2014లో కాకుండా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నెగ్గినవారే. 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి నెగ్గిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వంటి వారిని టీఆర్ఎస్ తమవైపు తిప్పుకొన్నా.. ఆ తర్వాత ఎన్నికల్లో నేరుగా టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఆ ముగ్గురు మాత్రం 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పక్షం వహించినవారు కావడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News