కలలోనూ ఊహించని ధర దక్కిన అతడికి నిద్ర లేదట

Update: 2022-12-24 10:46 GMT
సరిగ్గా నాలుగేళ్ల కిందట టీమిండియా ఇంగ్లండ్ లో పర్యటించింది. నాలుగు టెస్టుల సిరీస్ ఆడింది. అందులో ఓ 20 ఏళ్ల కుర్రాడు కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్ తో ఇటు బంతితో రాణించి మ్యాచ్ లను గెలిపించగల దమ్మున్నోడిగా కనిపించాడు. తర్వాత కూడా ఆ అంచనాలను నిలుపుకొంటూ వస్తున్నాడు. ఇంగ్లండ్ మూడు ఫార్మాట్లకు భిన్న ఆటగాళ్లను ఆడిస్తుండవచ్చు. కానీ, అతడు మాత్రం టెస్టులు, వన్డేలు, టి20లు ఇలా అన్ని ఫార్మాట్లలోనూ కీలకంగా ఉన్నాడు. ఇక టి20 ప్రపంచ కప్ లో ఇటీవల తన ప్రదర్శనతో మరింత మెరుగయ్యాడు. భవిష్యత్ సూపర్ ఆల్ రౌండర్ అని కితాబులందుకుంటున్నాడు. అతడే ఇంగ్లండ్ కు చెందిన శామ్ కరన్. శుక్రవారం ఐపీఎల్ మినీ వేలంలో ఏకంగా రికార్డు ధర రూ.18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతమైన కరన్.. వేలం గురించి ఆలోచిస్తూ గురువారం రాత్రి నిద్ర కూడా పోలేదంటున్నాడు.

భారత్ పై అరంగేట్రం.. పంజాబ్.. చెన్నై.. పంజాబ్ కరన్ 2018 టూర్ లో టీమిండియాపైనే అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ రెగ్యులర్ సభ్యుడయ్యాడు. విశేషమమంటే.. శామ్ కరన్ అన్న టామ్ కరన్ కూడా
ఇంగ్లండ్ కు ఆడాడు. ఐపీఎల్ లోనూ అతడు పాల్గొన్నాడు. కానీ, ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా వెళ్లిపోయాడు. ఇప్పుడు టామ్ కరన్ ను ఏ జట్టు తీసుకుందో చెప్పలేం. అసలు ఐపీఎల్ లో ఆడుతున్నాడా? లేదా? అనేది కూడా తెలియదు. కానీ, శామ్ కరన్ మాత్రం అంచలంచెలుగా ఎదుగుతూ జాతీయ జట్టులో పాతుకుపోయాడు.

ఇటీవలి టి20 వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అతడు.. 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు కూడా అందుకున్నాడు. అప్పటినుంచే ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను  పడింది. మినీ వేలంలో కర్రాన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ హోరా హోరీగా తలపడ్డాయి. అయితే చివరకు రూ.18.75 కోట్ల భారీ ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. కరన్ ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించింది కూడా పంజాబ్‌తోనే కావడం గమనార్హం. అనంతరం రెండు సీజన్లు చెన్నైకి ఆడాడు. మళ్లీ ఇప్పుడు పంజాబ్ కు
తిరిగొచ్చాడు.

పంజాబ్ రాత మారుస్తాడా? ఐపీఎల్ లో ఇప్పటివరకు టైటిల్ కొట్టని జట్టు ఏదంటే పంజాబ్. నిరుడు కొత్తగా వచ్చిన గుజరాత్ కూడా వెంటనే విజేతగా ఆవిర్భవించింది. కానీ, బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్ మాత్రం చాంపియన్ లు కాలేకపోతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ టైటిల్ కు దగ్గరగా అయినా వస్తున్నాయి. పంజాబ్ మాత్రం సెమీఫైనల్ కూడా చేరడం లేదు. మరిప్పుడు మంచి ఫామ్ లో ఉన్న కరన్ పంజాబ్ ను విజేతగా నిలపుతాడేమో చూడాలి. కాగా, ఐపీఎల్ వేలం గురించి తలుచుకుంటూ.. 'నేను రాత్రి పెద్దగా నిద్రపోలేదు. ఎగ్జయిట్‌మెంట్‌తో నిద్ర రాలేదు. వేలం ఎలా ఉండబోతుంది? అనే ఆలోచనతోనే గడిపేశా. అంత భారీ ధర వస్తుందని అసలు ఊహించలేదు' అని చెప్పాడు. మళ్లీ పంజాబ్‌తో చేరడంపై కర్రాన్ సంతోషం వ్యక్తం చేశాడు.

'నా ఐపీఎల్ కెరీర్ మొదలైన ఫ్రాంచైజీకి మళ్లీ చేరడం చాలా సంతోషంగా ఉంది. నాలుగేళ్ల క్రితం పంజాబ్‌ ఆటగాడిగానే ఐపీఎల్ అరంగేట్రం చేశా. మళ్లీ ఆ జట్టుతో చేరడం చాలా బాగుంది. ఆ జట్టులో ఉన్న ఇంకొందరు ఇంగ్లండ్ ఆటగాళ్లను కలవడం కోసం ఎదురు చూస్తున్నా' అని చెప్పాడు. నాలుగేళ్ల క్రితం 2019లో కర్రాన్‌ను రూ.7.20 కోట్లకు అతన్ని పంజాబ్ కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో అద్భుతంగా రాణించిన అతను.. పంజాబ్ తరఫున హ్యాట్రిక్ తీసుకున్నాడు. అలాగే కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News