సాయిపల్లవి పిటిషన్ ను కొట్టేసిన టీ హైకోర్టు.. ఏ కేసులో అంటే?

Update: 2022-07-08 00:57 GMT
ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇది అందరికి వర్తించినా.. సెలబ్రిటీలు.. ప్రముఖుల విషయంలో ఈ అంశం మరింత వర్తిస్తుంది. ఇటీవల కాలంలో మాట్లాడే ప్రతి మాట విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండటమే కాదు.. ప్రముఖులు ఎవరైనా.. చిన్న మాట తేడాగా మాట్లాడినా దానికి సంబంధించి కొత్త తిప్పలు ఎదురవుతున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే ప్రముఖ హీరోయిన్ సాయిపల్లవికి ఎదురైంది. ఈ మధ్యన తాను నటించిన మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు కొత్త తిప్పులు తెచ్చి పెట్టాయి.

కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోరక్షకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావటం.. దానిపై పలువురు ఆగ్రహానికి గురి కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులకు భజరంగ్ దళ్ నేతలు చేసిన ఫిర్యాదుపై ఆమెకు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఆమె అభ్యర్థనను టీ హైకోర్టు తోసిపుచ్చటంతో పాటు ఆ పిటిషన్ ను కొట్టేసింది. దీంతో.. సుల్తాన్ బజార్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు ఆమె స్పందించటంతో పాటు తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ మొత్తం వివాదానికి కారణం.. విరాటపర్వం సినిమా విడుదల సమయంలో నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమమే. ఇందులో ఆమెను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో ఆమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె పోల్చిన పోలికపై పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమైంది. సంబంధం లేని రెండు అంశాల్ని ముడివేయటం ద్వారా.. ఆమె ఏదో చెప్పే ప్రయత్నం చేయటం.. అది కాస్తా పలువురి ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.

తాను లెఫ్ట్ వింగ్.. రైట్ వింగ్ విన్నానని.. తాను మాత్రం న్యూట్రల్ గా ఉంటానని చెప్పారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ.. తొంభైల్లో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో ఆ సినిమాలో చూపించారని.. కొవిడ్ వేళ.. ఒక ప్రాంతంలో గోవును తరలిస్తున్నవేళ.. దాని డ్రైవర్ ఒక ముస్లిం అని.. అతడ్ని కొట్టి జై శ్రీరాం.. జైశ్రీరాం అంటూ నినాదాలు చేశారని పేర్కొన్నారు. కశ్మీర్ లో జరిగిన దానికి.. గోరక్షకులు చేసిన దానికి తేడా ఏమిటన్న ప్రశ్నను సంధిస్తూ.. 'మనం మంచిగా ఉండాలి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు'అంటూ ఆమె చేసిన వ్యాఖ్యపై పలువురు భగ్గుమన్నారు. దీనిపై ఆమె కూడా వివరణ ఇవ్వటం జరిగింది.

అయితే.. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గో సంరక్షణ సమితి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. టీ హైకోర్టు తాజా స్పందన నేపథ్యంలో ఆమెపై చేసిన ఫిర్యాదుకు సంబంధించి తదుపరి ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. మొత్తంగా చూసినప్పుడు నోటి మాట తెచ్చిన తిప్పలు ఎంతలా ఇబ్బంది పెడతాయన్న విషయం సాయిపల్లవికి రానున్న రోజుల్లో మరింత అర్థం కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News