కేసీఆర్ కు 'విదేశీ కుట్ర' ఫీడ్ బ్యాక్ ఇచ్చిందెవరు?

Update: 2022-07-18 04:45 GMT
నలుగురు కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకునే వేళలో సవాలచ్చ కబుర్లు దొర్లుతుంటాయి. అలాంటి వాటిని ఉబుసుపోకు మాటలుగా చెప్పేస్తుంటారు. ఆ సందర్భంలో మాటలు చెప్పేవారు.. వినేవారు సీరియస్ గా ఉన్నట్లుగా కనిపించినా.. వాటికి సంబంధించిన వాస్తవికత ఎంతన్న దానిపై ఎవరు ఫోకస్ పెట్టేది ఉండదు. ఈ తరహా ఉబుసుపోకు మాటల్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ చేస్తే ఆయన వింటారా? విన్నారే అనుకుందాం.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడతారా? అన్న ప్రశ్నలు మదిలో మెదలకు మానవు.

తాజాగా చోటు చేసుకున్న వరదల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ సంచలన వ్యాఖ్య చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి.. అందునా కేసీఆర్ లాంటి మేధావి అధినేత వద్దకు వచ్చి..క్లౌడ్ బరస్ట్ అన్నది మామూలుగా జరగదని.. దాని వెనుక విదేశీ కుట్ర ఉందని చెప్పటం ఒక ఎత్తు అయితే.. దాన్ని కేసీఆర్ ఇట్టే నమ్మేయటం అంత సులువుగా సాగే అంశం కాదు.

కేసీఆర్ లాంటి ప్రముఖుడికి ఇలాంటి మాటలు చెప్పే వారంటే.. వాళ్లు సామాన్యులై ఉండరు. ఇలాంటి సమాచారాన్ని అందించిన వ్యక్తి సాదాసీదా అయితే.. సీఎం కేసీఆర్ నోటి నుంచి ఉత్తినే వచ్చేయవు కదా? అలా వచ్చాయంటే.. ఆ విషయాన్ని చెప్పిన వ్యక్తి ప్రొఫైల్ కూడా పెద్దదై ఉండి ఉంటుంది. ఇంతటి సంచలన అంశాన్ని జనాలకు చెప్పేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడున్న భయాలకు మరో భయం తోడు కావటం.. మరిన్ని భయాల్ని క్రియేట్ చేసే వాట్సాప్ వర్సిటీకి.. సోషల్ మీడియా వర్సిటీకి మేత వేయటం మిననహా మరో ప్రయోజనం ఉంటుందా? అన్నది ప్రశ్న.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇలాంటి సున్నిత సమాచారం తనకు అందిన వెంటనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారన్నది మరో ఆసక్తికర అంశం. తన పరిధిలోని అంశమైతే.. దానికో టీంను వేసి.. దాని సంగతి చూడాలని చెప్పే వీలుంది. మరి.. కేసీఆర్ చెబుతున్నది అంతర్జాతీయ అంశం. అంటే.. కచ్ఛితంగా ఇది కేంద్రం మాత్రమే డీల్ చేయాల్సిన అంశం. మరి.. కేంద్రంతో తన వద్ద ఉన్న సున్నిత సమాచారాన్ని షేర్ చేసుకున్నారా? అన్నది మరో ప్రశ్న.

విదేశీ కుట్ర అంటూ వ్యాఖ్యానించే ముందు.. అందుకు తన దగ్గర ఉన్న ఆధారాలేమిటన్న దానిని ప్రజలకు చెప్పాల్సిన అవసరం సీఎం కేసీఆర్  కు లేకున్నా.. కేంద్రానికి చెప్పాల్సి ఉంటుంది. సీఎం కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ విదేశీ కుట్ర మాటకు సంబంధించిన మరింత సమాచారాన్ని కేంద్రం ఏ విధంగా సేకరిస్తుంది? అన్నది ప్రశ్న.

నిజానికి ఈ తరహా వ్యాఖ్య చేసిన కేసీఆర్ ను మాత్రమే కాదు.. ఆయనకు ఫీడ్ బ్యాక్ ఇచ్చిన వారిని సైతం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ.. ఫీడ్ బ్యాక్ ఇచ్చేటోళ్లు ఏదైనా కుట్ర చేసి.. ఇలాంటి సంచలనాలు జనాల్లోకి తీసుకెళ్లి వారిని మరింత భయబ్రాంతుల్ని చేయాలని చూస్తున్నారా? అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది.
Tags:    

Similar News