బాలయ్య నడిపిన బుల్లెట్టూ హీరోయే

Update: 2015-10-28 08:29 GMT
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఉన్న అభిమాన గణం.. ఆయనకు ఉన్న క్రేజు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు - రాజకీయాలు రెండు పడవలపై ఆయన ప్రయాణిస్తున్నా జోరు మాత్రం తగ్గలేదు. హిందూపురం నియోజకవర్గంలో దూసుకుపోతున్న బాలయ్య రెండు నెలల కిందట అక్కడికి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన నడిపిన బుల్లెట్ కోసం ఆయన అభిమానులు, అక్కడి నాయకులు ఎగబడుతున్నారట. అయితే, ఆ బుల్లెట్ అసలు యజమాని మాత్రం దానిని విక్రయించేందుకు ససేమిరా అంటున్నారు.

ఆగస్టు 21న బాలకృష్ణ హిందూపురం వచ్చారు. అప్పుడాయన హైదరాబాద్ నుంచి విమానంలో బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హైవే మీదుగా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్ట్ వరకు వచ్చారు. అక్కడ ఒకరి నుంచి బుల్లెట్ తీసకుని తానే స్వయంగా నడుపుతూ హిందూపురం చేరుకున్నారు. ఏపీ 02 ఏవీ3751 నంబరున్న ఆ బుల్లెట్ కొడికొండ చెక్ పోస్టులో హరిత రెస్టారెంట్ మేనేజరుగా ఉన్న కొక్కంటి రామిరెడ్డిది. ఆ సంగతి తెలిసిన బాలయ్య అభిమానులు అప్పటి నుంచి రామిరెడ్డి వెంట పడుతున్నారు. బాలయ్య నడిపిన బుల్లెట్ ను తమకు విక్రయించాలని కోరుతున్నారు. అయితే, రామిరెడ్డి కూడా అనుకోకుండా తనకు ఛాన్సు దొరికిందని.. తన వాహనాన్ని బాలయ్య నడపడం అదృష్టమని చెబుతూ... అలాంటి బుల్లెట్ ను ఎంత రేటిచ్చినా ఎవరికీ విక్రయించబోనని చెబుతున్నారు. దీంతో కొందరు అభిమానులు, చోటా నాయకులు టీడీపీ జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలతో రామిరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారట.  బాలయ్య నడిపిన బుల్లెట్టా మజాకానా?
Tags:    

Similar News